లోకేష్ బరువు తగ్గటానికి రీజన్ చెప్పిన రోజా.. టీడీపీని జూమ్ చేసి చూడాలంటూ సెటైర్లు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ జూమ్ పార్టీ అని, చంద్రబాబు నాయుడు జూమ్ నాయుడని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ఇక చంద్రబాబు నాయుడిని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని, ఆ పార్టీని ఇక జూమ్చేసి చూడాల్సిందేనని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
ప్రజలు మూలాన కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: మహానాడు తీర్మానాలపై రోజా ఫైర్
చంద్రబాబు రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకుంటే మంచిది
టీడీపీ మహానాడు వల్ల ఏం ప్రయోజనం లేదని కేవలం వైసీపీని ఆడిపోసుకునే కార్యక్రమమే చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రాజకీయాల నుండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని అన్నారు రోజా .నగరి నియోజకవర్గంలో కరోనా లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసరాలు అందిస్తున్న ఎమ్మెల్యే రోజా ఏపీలో వైసీపీ పాలనపై కితాబిచ్చారు. ఇక చంద్రబాబు నాయుడికి అధికారం లేక ఏం చెయ్యాలో పాలుపోవటం లేదని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మద్యంలో ఎక్కువగా సంపాదించుకుంటున్నారంటూ టీడీపీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా చాలా తీవ్రంగా స్పందించారు.
జగన్ వచ్చాకే దశల వారీ మద్య నిషేధం
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యపాన నిషేధం కొనసాగుతుందని అన్నారు. ఇక దానిని అమలు చేసే ప్రక్రియలో 43 వేల బెల్టుషాపులు, 33 శాతం వైన్ షాపులు, 40 శాతం బార్లు తొలగించారని రోజా పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మద్యం విక్రయ సమయాన్ని తగ్గించి పలు సంస్కరణలు తెచ్చారని 75 శాతం ధరలు పెంచి లిక్కర్ అందని ద్రాక్షగా మార్చేశారని రోజా పేర్కొన్నారు . వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చాలా వరకు మద్యపానం కంట్రోల్ అయిందని ఆమె అన్నారు .
జగన్ మద్య నిషేధం కోసం పని చేస్తుంటే లోకేష్ తలతిక్కగా మాట్లాడుతున్నారు
రాష్ట్రంలో 15 డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుచేసి తాగుబోతులను మార్చే పని చేస్తున్నారని జగన్ ను ఆమె కొనియాడారు. చాలా చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నారని , ఇతర రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి వచ్చినా, సారా కాచి విక్రయించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటున్నారని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేశారని రోజా పేర్కొన్నారు .
ఇక మహానాడులో మద్యం విషయంలో ప్రభుత్వంపై లోకేష్ తలతిక్కగా మాట్లాడుతున్నారని మండిపడిన రోజా ఆయన బరువు తగ్గటం వెనుక రీజన్ చెప్పారు.
అధికారం పోవటం , మద్యం సిండికేట్ల డబ్బు రాకపోవటం లోకేష్ బరువు తగ్గటానికి కారణం
మద్యం సిండికేట్లతో ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన లోకేష్ బాగా ఒళ్లు పెంచాడని, నేడు అధికారం పోయేసరిగా, మద్యం వసూళ్లు లేక 20 కిలోలు తగ్గిపోయారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, తనకు తానూ గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునే చంద్రబాబు కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారికి అండగా ఉండలేదని, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగితే కూడా వారి కోసం రాలేదని అన్నారు. ఇక విజయవాడలో మహానాడు కోసం వచ్చారని , మహానాడు నిర్వహించి తిరిగి వెళ్ళిపోయాడని అన్నారు. ప్రజలకు ఏ రీతిన అండగా నిలవాలన్న విషయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్రెడ్డిని తిట్టటానికి మహానాడు పెట్టారని ఆమె మండిపడ్డారు .