వాటిలోనూ ‘నారాయణ’ ఫస్టే, ఇద్దరూ కలిసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు : ఎమ్మెల్యే రోజా
విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నపత్రాల లీకులు వంటి అక్రమాల విషయంలోనూ నారాయణ విద్యాసంస్థలు ఫస్టే ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
అమరావతి: ప్రతి సంవత్సరం ఫస్ట్ ర్యాంక్.. సెకండ్ ర్యాంక్.. థర్ట్ ర్యాంక్ అంటూ ప్రకటనలిచ్చి గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యాసంస్థలు.. ఆ విద్యా సంస్థల్లో జరిగే విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నపత్రాల లీకులు వంటి అక్రమాల విషయంలోనూ ఫస్టే ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంగళవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా ముఖ్యమంత్రి అసమర్థ పాలన, మంత్రుల దద్దమ్మల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం రాజకీయ అవగాహన లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి పాలన మొత్తం ఆయన చేతిలో పెట్టారని విమర్శించారు.
ఇద్దరూ కలిసి భ్రష్టు పట్టించారు..
వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, నారాయణ.. ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని రోజా మండిపడ్డారు. ఇద్దరు వియ్యంకులు కలిసి విద్యా వ్యాపారం కోసం అనేక అక్రమాలకు పాల్పడుతూ విద్యార్తుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు.
ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతో...
ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు, మంత్రి నారాయణ జిల్లా నెల్లూరు, గంటా శ్రీనివాసరావు ఇన్ ఛార్జిగా ఉన్న వైఎస్ ఆర్ కడప, ఆయన జిల్లా విశాఖలోనూ పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని తెలిపారు. నారాయణ విద్యా సంస్థల ర్యాంకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుని, వారి జీవితాలు నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని రోజా ప్రశ్నించారు.
మంత్రి గంటా ఎందుకు స్పందించరు?
విద్యాలయాల్లో జరుగుతున్న ఘటనలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోకుండా మంత్రి గంటా ఆడియో ఫంక్షన్ కు వెళ్లారని, మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆయన అమెరికాలో పర్యటిస్తారని, ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల్లో పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయితే.. ఆస్తుల కేసు నుంచి బయటపడేందుకు పెద్దలను ప్రాధేయపడే పనిలో బిజీగా ఉన్నారని రోజా దుయ్యబట్టారు.
ఇద్దరూ రాజీనామా చేయాలి...
బాధ్యత కలిగిన మంత్రులుగా వాళ్లిద్దరూ ఎన్నిరోజులు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారో వెల్లడించాలన్నారు. నిజంగా గంటాకు సిగ్గు శరం ఉంటే నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు మంత్రులు నారాయణ, గంటాలను బర్తరఫ్ చేసి, నారాయణ విద్యా సంస్థల్లో పేపర్ లీకేజిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అలా చేయలేకపోతే సీఎం స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని హితవు పలికారు.