బాబు ఇంట్లో సంక్రాంతి: రోజా, వివేకా 'జేసీని చూసి ఆశ్చర్యపోతున్న ఆర్టిస్ట్లు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం కొందరు నాయకులు చిందులు వేస్తున్నారని, అది సిగ్గుచేటు అని వైసిపి ఎమ్మెల్యే రోజా, ఆ పార్టీ సీనియర్ నేత వైయస్ వివేకానంద రెడ్డి మండిపడ్డారు.
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం కొందరు నాయకులు చిందులు వేస్తున్నారని, అది సిగ్గుచేటు అని వైసిపి ఎమ్మెల్యే రోజా, ఆ పార్టీ సీనియర్ నేత వైయస్ వివేకానంద రెడ్డి మండిపడ్డారు.
కరువు, చంద్రబాబు కవల పిల్లలు లాంటివని, రుణమాఫీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, గతం కంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు మరింత పెరిగాయన్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు ఇంట్లోనే సంక్రాంతి
ప్రస్తుతం కరువు పరిస్థితులు రాయలసీమ ప్రాంతాన్ని కళావిహీనం చేశాయన్నారు. సంక్రాంతి సంబరాలు పల్లెల్లో కనిపించడం లేదని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిలో మాత్రమే సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయన్నారు.
చంద్రబాబు హయాంలో అరిష్టం
టిడిపి అధికారంలోకి రాగానే ఏపీకి అరిష్టం ఏర్పడి అవినీతి, అరాచకం కనిపిస్తున్నాయన్నారు. గత మూడు సంవత్సరాలుగా రైతులు దరిద్రం, కరువుతో అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. కానీ చంద్రబాబు రైతు బాంధవుడుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రైతుల పక్షపాతి అంటే వైయస్ రాజశేఖర్రెడ్డేనని, ఆయన హయాంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
ఆత్మహత్యలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి 2015 సంవత్సరంలో 900 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 400 మంది రైతులే ఉన్నారన్నారు. 2016వ సంవత్సరంలో ఆత్మహత్యలో 45 శాతానికి పెరిగాయన్నారు. అభివద్ధిలో డబుల్ డిజిట్ అంటూ చంద్రబాబు అబద్దాలు చెప్పుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులకు కొత్తగా చేసిందేమీలేదన్నారు.
చెత్తవాగుడు కాదు..
బహిరంగ సభల్లో టిడిపి నాయకుల ప్రవర్తన సిగ్గుచేటన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కట్టిన పైడిపాళెం ప్రాజెక్టుకు 660 కోట్లు ఖర్చు చేస్తే కేవలం రూ.23 కోట్లు ఖర్చు చేసి మేము సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.రాష్ట్రంలోని రైతులు వైయస్కు రుణపడి ఉన్నారని, బహిరంగ సభల్లో చెత్తవాగుడు వాగేవారు అసలు నిజాలు తెలుసుకోవాలన్నా రు.
చిన్నమ్మకు పట్టుచీర తెస్తానన్నాడట
హంద్రీ-నీవా, గాలేరు-నగిరి వైయస్ హయాంలోనే వచ్చినవని, కుప్పంలో నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని, అనంతపురంలో తీవ్ర కరువు తాండవిస్తోందని, వాటిని ముఖ్యమంత్రి పట్టించుకోకుండా సీమకు ఏదో చేశామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. అమ్మకు నేత చీర లేదు.. పిన్నమ్మకు పట్టుచీర తెస్తానన్న చందంగా ఆయన తీరు ఉందన్నారు.
జేసీపై ఆగ్రహం
బహిరంగ సభలో చంద్రబాబు మెప్పుకోసం జేసీ దివాకర్ రెడ్డి చేసిన చెక్క భజనలు చూసి కళాకారులు ఆశ్చర్యపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను, జగన్ని తిడితే నాయకుడు కాలేరని, అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రాజెక్టులకు జగన్ అడ్డుపడుతున్నారని మాట్లాడడం మంచిది కాదన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. అన్ని మతాలను గౌరవించే స్థాయి జగన్కు ఉందన్నారు.