అమరావతి కోసం టీడీపీ ఆఖరి అస్త్రం ? మూకుమ్మడి రాజీనామాల ప్రచారం- అదేం లేదంటున్న పార్టీ..
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ కాక రేపుతోంది. విపక్షాలు అడ్డుతగులుతున్నా, అమరావతి రైతులు వద్దంటున్నా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ ప్రధాన విపక్షం నిరసనలు తెలుపుతోంది. ఇక అమరావతిపై తమ చిత్తశుద్ధిని చాటుకునేందుకు ఏకంగా తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ వర్గాలు దీన్ని నిర్ధారించడం లేదు.
జగన్ మాట తప్పాడు.. మడమ తిప్పాడు... అమరావతి స్వప్నం సర్వనాశనం : చంద్రబాబు
మూడు రాజధానులపై టీడీపీ...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఓవైపు ప్రభుత్వం చకచకా పావులు కదుపుతుంటే మరోవైపు దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమరావతి పేరుతో తాము సంపాదించుకున్న మైలేజ్ ను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం నీరు కారుస్తుండగా.. ఇప్పుడు మూడు రాజధానుల ఆమోదంతో ఇక ఆ పేరు కూడా కనుమరుగయ్యేలా ఉందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకే అమరావతి నుంచి రాజధాని తరలింపును అడ్డుకునేందుకు చివరి అస్త్రాలను బయటికి తీస్తోంది. ఓవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ఈ పోరు ద్వారా రాజకీయంగానూ మైలేజ్ కోసం ప్రయత్నిస్తోంది.
మూకుమ్మడి రాజీనామాస్త్రం...?
గతంలో ఏపీ విభజన సందర్భంగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సమైక్యాంధ్ర కోసం ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించగా.. తెలంగాణ కోసం టీఆర్ఎస్ మూకుమ్మడి రాజీనామా అస్త్రాన్ని ఎంచుకుంది. చివరికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఫలించి తెలంగాణ సాకారమైంది. అంతకుముందే ఏపీలో వైసీపీకి మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేయించి 16 మందిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తమకున్న 20 మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు ఎంపీలు, ఎమ్మెల్సీలతో మూకుమ్మడి అమరావతికి మద్దతుగా రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended Video
వైసీపీ మైండ్ గేమ్ అంటూ...
ప్రస్తుత పరిస్దితుల్లో అమరావతిపై తమ స్టాండ్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, అలాగే తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందుకోసం రాజీనామాలు సమర్పించాలని తాము భావించడం లేదని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ మాత్రమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాము రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించి ఉప ఎన్నికల డ్రామాకు తెరలేపాలని వైసీపీ భావిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వైసీపీ ఎంత రెచ్చగొట్టినా తాము మాత్రం అమరావతిపై పోరులో రాజీనామాలకు వెళ్లబోమని, అవసరమైతే మూడు రాజధానులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ఉప ఎన్నికలు కోరాలని సూచిస్తున్నారు.