జయ భయపెట్టేవారా: రోశయ్య మాట ఇదీ, వైఎస్ జీవించి ఉంటే...
రాజకీయాల్లో పెద్ద మనిషిగా పేరు పొందిన కె. రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా రిటైరయ్యారు. అనూహ్యమైన పరిస్థితిలో ఆయన సిఎం అయ్యారు. ఆయన పలు విషయాలపై మాట్లాడారు...
హైదరాబాద్: అనూహ్యమైన పరిస్థితిలో కాంగ్రెసు సీనియర్ నేత కె. రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మృతితో ఆయనకు ఆ పదవి లభించింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా వెళ్లారు.
తెలంగాణ ఉద్యమం, వైయస్ జగన్ తిరుగుబాటు వంటి తీవ్రమైన పరిణామాలను ముఖ్యమంత్రిగా ఆయనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశాయి. అప్పటి పరిస్థితులపై ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీ ఫేస్ 2 ఫేస్ కార్యక్రమంలో మాట్లాడారు. జయలలితతో తనకు గల సంబంధాలపై కూడా ఆయన మాట్లాడారు.
తాను ఎటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రిని అయ్యాను, జగన్ ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ ఎందుకు జరిగింది, రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెసు అధిష్టానం ఆలోచనపై తాను ఎలా స్పందించింది వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కానీ ఎక్కడా వివాదాలకు తావు లేకుండా మాట్లాడే తన సహజరీతినే అనుసరించారు
వైఎస్ బతికి ఉంటే విభజన జరిగేది కాదు...
వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని రోశయ్య అన్నారు. వైఎస్ జీవించి ఉంటే మార్పులు ఉండేవి కావని ఆయన అన్నారు. కాంగ్రెసులో ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి స్వతంత్రంగా వ్యవహరించేవారని, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొంత స్వతంత్రంగా వ్యవహరించారని ఆయన చెప్పారు. చెన్నారెడ్డి ప్రతిదానికీ హైకమాండ్ అనేవారు కాదని ఆయన చెప్పారు. చెన్నారెడ్డి ప్రభుత్వం ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
జయ తెలుగులోనే పలకరించేవారు..
జయలలిత తనను ఎప్పుడు కూడా తెలుగులోనే పలకరించేవారని రోశయ్య చెప్పారు. జయలలితను ఇబ్బంది పెట్టే పరిస్థితి తనకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. జయలలితతో సంబంధాలు బాగుండేవని, వివాదరహితంగా వెళ్లిపోయిందని ఆయన అన్నారు. తాను విషయాలను బట్టి నడుచుకున్నానని ఆయన చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తనను మార్చవద్దని జయలలిత అడిగినట్లు వినికిడి అని చెప్పారు. తనను కొనసాగించాలని జయలలిత రెండోసారి లేఖ రాశారని చెప్పారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య తమిళనాడు గవర్నర్గా పనిచేశారు.
వాళ్ల ఒత్తిళ్లు వాళ్లకున్నాయి...
జయలలిత లేఖ రాసినప్పటికీ రెండో సారి గవర్నర్గా కేంద్రం కొనసాగించకపోవడంపై రోశయ్య స్పందించారు. వాళ్ల ఒత్తిళ్లు వాళ్లకు ఉంటాయని, వాళ్ల పార్టీలో చాలా మంది ఉన్నారని, అందుకని తనకు పొడగింపు ఇవ్వలేదు కావచ్చునని రోశయ్య అన్నారు.
వైఎస్ మరణంతోనే సిఎంనయ్యా...
వైఎస్ రాజశేఖర రెడ్డి అకస్మిత మృతి వల్లనే తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన చెప్పారు. నేను సిఎం కావడం ఏమిటని మంత్రులు అన్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని అయిన తర్వాత తనపై తీవ్రమైన ఒత్తిడి ఉండేదని చెప్పారు. ఎవరు వచ్చినా పనుల కోసమే వచ్చేవారని, అవి ఆర్థికపరమైనవి కావడం వల్ల ఒత్తిడి ఉండేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని ఊహించలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా నువ్వే అండాలని హైకమాండ్ అంత కచ్చితంగా చెబుతుందని తాను అనుకోలేదని అన్నారు.
జగన్ను వద్దనడానికీ...
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ వద్దని కాంగ్రెసు అధిష్టానం అనుకోవడానికి ఆయనకు అనుభవం లేదని కావచ్చని రోశయ్య అన్నారు, అధిష్టానమంటే ఒక్కరు కాదని అంటూ ఏడెనిమిది మంది చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రిగా వేరొకరు ఉండాలనే కారణంతో తనను వ్యతిరేకించి ఉంటారని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తామంటే వద్దని చెప్పా...
రాష్ట్రాన్ని విభజిస్తామంటే వద్దని తాను అధిష్టానానికి చెప్పానని రోశయ్య తెలిపారు. తెలంగాణకు సంబంధించి తనకు తీవ్రమైన ఒత్తిడి ఉండేదని అన్నారు. నిర్ణయం తీసుకునేది మీరు, విభజించాలనుకుంటే వేరేవాళ్లను ముఖ్యమంత్రిగా పెట్టి చేసుకోండని చెప్పినట్లు తెలిపారు. విభజన వద్దని చెబుతూనే తనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి విభజన చేస్తామంటే కుదరదని చెప్పినట్లు తెలిపారు. విభజనను అపే శక్తి తనకు లేదు కాబట్టి అలా చెప్పానని అన్నారు.
కిరణ్ రెడ్డి అందుకే ఢిల్లీ చుట్టూ..
తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగారని అనుకోవచ్చునని ఆయన అన్నారు. కిరణ్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తనకు గోతులు తవ్వాడని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. బహుశా ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన ఢిల్లీ చుట్టూ తిరిగి ఉంటాడని, అంతకన్నా ఏం ఉంటుందని రోశయ్య అన్నారు. అయితే తాను సీరియస్గా తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డితో శుభ్రంగా మాట్లాడుతానని, తనకు ఏ విధమైన కోపం లేదని అన్నారు. తాను నాయకుడిగా ఎప్పుడూ ఫీల్ కాలేదని అన్నారు.
తండ్రి తెచ్చిన అధికారం కావాలని జగన్...
తండ్రి తెచ్చిన అధికారం తనకు కావాలని జగన్ అనుకున్నాడని ఆయనయ చెప్పారు. తాను చిన్న కులం నుంచి వచ్చినవాడినని, అందుకే సంతకాల సేకరణ జరిపారని చెప్పారు. జగన్ విషయంలో అధిష్టానం అంచనా పొరపాటు అని తాను అనుకోవడం లేదని అన్నారు. టైమ్ వస్తుందని తాను జగన్కు చెప్పినట్లు తెలిపారు. వెయిట్ చేస్తే మంచిదని చెప్పినట్లు కూడా తెలిపారు. మా నాన్న సిఎంగా ఉన్నాడు, మా నాన్న గెలిపించాడు, మా కుటుంబమంతా రాజకీయాల్లో కష్టపడి పనిచేస్తున్నామని జగన్ అనేవాడని చెప్పారు.
కొండ సురేఖ వైఎస్ అభిమాని...
ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎవరి విధేయతలను బట్టి వారు ఆలోచించేవారని రోశయ్య అన్నారు కొండా సురేఖకు వైయస్ రాజశేఖర రెడ్డిపై అచంచలమైన విశ్వాసం ఉండేదని, దాంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరిందని, అందువల్లనే జగన్ సిఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టారని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడంలో తప్పులేదని అన్నారు.
విభజన తప్పు అనను, తొందరపాటు..
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెసు అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం తప్పు అని తాను అనని రోశయ్య చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తామని ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయాన్ని గుర్తు చేయగా, తొందరపడి నిర్ణయం తీసుకున్నారని అనిపించిందని అన్నారు. తనను ముఖ్యమంత్రిగా పెట్టి తప్పు చేశామని అధిష్టానం అనుకోలేదని, అలా అనుకుంటే తనను గవర్నర్గా పంపించేవారు కాదని ఆయన చెప్పారు. తప్పు అని అనుకుని ఉంటే గవర్నర్ పదవి ఇచ్చేవారు కాదని అన్నారు. గవర్నర్ పదవి ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లినప్పుడు ఇప్పటికే ఆలస్యమైందని సోనియా గాంధీ చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.
జయ భయపెట్టి పార్టీని నడిపేవారా...
జయలలిత నాయకత్వంలో అన్నాడియంకె ఐక్యంగా ఉండేదని, ఏ నిర్ణయం చేస్తే అది అమలయ్యేదని, క్రమశిక్షణ ఉండేదని, భయపెట్టి చేయలేదని రోశయ్య చెప్పారు అనుమానం వస్తే మాత్రం తీవ్రమైన చర్యలుండేవని అంగీకరించారు. ప్రాంతీయ పార్టీ కాబట్టి నియంత్రణ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి అలా ఉండకపోవడంపై వ్యాఖ్యానిస్తూ అది చెన్నై, ఇది హైదరాబాద్ అని ఆయన అన్నారు.
జగన్కు సలహా ఇలా...
జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారా అని అడిగితే రోశయ్య సూటిగా సమాధానం చెప్పలేదు. పార్టీ పెట్టాడుగా, నడుస్తోందని అన్నారు. కష్టపడి పనిచేయాలని చెబుతానని అన్నారు. అంటే, కష్టపడి పనిచేయడం లేదని భావిస్తున్నారా అంటే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలని సూచిస్తానని అన్నారు.