ఆ యాప్లో పొందుపరిచిన తరువాతే ఎన్నికల ఫలితాలు వెల్లడి: కౌంటింగ్ కేంద్రాల్లో ఇవి నిషిద్ధం
అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఓ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సువిధ యాప్. మొదట ఇందులో పొందు పరిచిన తరువాతే ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రతి రౌండ్ వివరాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే వెసలుబాటును కల్పించారు. సువిధ యాప్ నిర్వహణ, అందులో ఫలితాల వివరాలను పొందుపరిచే బాధ్యతలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల ఆవరణలో ఫలితాలను వెల్లడించడానికి ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను అమర్చారు. ప్రతి అయిదు నిమిషాలకూ ఇందులో సమాచారం అప్డేట్ అవుతుంటుంది. సైబర్ సెక్యూరిటీ నిబంధనలను అనుసరించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పెన్డ్రైవ్లు, సీడీలను తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వరు. అలాగే- సెల్ఫోన్లను కూడా అనుమతించరు. పోస్టల్ బ్యాలెట్లు, తిరస్కరించిన ఓట్ల వివరాలు కూడా ఈ డిస్ప్లే బోర్డులో ప్రదర్శించేలా ఏర్పాటు చేశారు. ఓ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల వివరాలు, పోలైన ఓట్లు, నోటా, తిరస్కరణకు గురైనవి, పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాల కోసం ఫామ్ 21-ఇపై రిటర్నింగ్ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది.
సెల్ఫోన్లు నిషిద్ధం
కౌంటింగ్ సిబ్బంది సెల్ఫోన్లను తమ వెంట తీసుకెళ్లడాన్ని నిషేధించారు. కేంద్ర ప్రత్యేక పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులకు మాత్రమే సెల్ఫోన్ తీసుకెళ్లొచ్చు. సువిధ యాప్లో ఫలితాలను ప్రకటించడం కోసం దీన్ని రిటర్నింగ్ అధికారులు తమ స్మార్ట్ ఫోన్కు వచ్చే ఓటీపీని చూసుకోవడానికి మాత్రమే ఫోన్ వినియోగించడానికి అనుమతిస్తారు. ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్తో పాటు కౌంటింగ్ కేంద్రాల వెలుపల ఆటో స్క్రోలింగ్ ప్యానెల్స్ రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు.