బాలకృష్ణ వల్లేనా? బాబుకు తలనొప్పి: నంది అవార్డులు ఎవరికి, ఎలా సంబంధం?
నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదం కావడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీరియస్గా ఉంది. ఒకరిద్దరు మాత్రమే వీటిని తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
హైదరాబాద్: నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదం కావడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీరియస్గా ఉంది. ఒకరిద్దరు మాత్రమే వీటిని తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అన్నింటిని పరిగణలోకి తీసుకొని అవార్డులు ఇచ్చినట్లు చెబుతున్నారు. నంది అవార్డుల వివాదంపై సీఎం చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.
నంది అవార్డ్: జూ ఎన్టీఆర్ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?
బాలకృష్ణ చుట్టూ తిరుగుతున్న వివాదం
నంది అవార్డుల వివాదం ముఖ్యంగా నటుడు బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. అవార్డుల ప్రకటనలో ఆయన పాత్ర ఉందని, ఆయన ప్రభావితం చేశారని ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు వస్తున్నాయి. తమ వారికే నంది ఇచ్చుకున్నారని మండిపడుతున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం కూడా చర్చనీయాంశంగా మారింది.
కమ్మ వారికే ఎక్కువ అవార్డులు
నంది అవార్డులు ఎక్కువగా కమ్మ కమ్యూనిటీ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి వచ్చాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఆ పత్రికలో ఎవరెవరికి అవార్డులు ఇచ్చారు, వారు ఎవరికి ఎలా దగ్గర అనే అంశాలను వెల్లడించింది. అయితే, పార్టీకి చెందిన వారు అయినంత మాత్రాన అవార్డులు ఇవ్వవద్దనేది లేదు. విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కథనం రావడం గమనార్హం.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను
2014లో వచ్చిన లెజెండ్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఈ సినిమాకు గాను బాలకృష్ణకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఈయన స్వయంగా హిందూపురం టీడీపీ శాసన సభ్యుడు. ఇదే సినిమాకు బోయపాటి శ్రీనుకు వచ్చింది. ఈయన ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారని పేర్కొంటున్నారు
మహేష్ బాబు శ్రీమంతుడు
2015లో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో నటించారు. ఈ సినిమాకు గాను ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. మహేష్ బాబు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ బావమరిది.
లక్ష్మీ మంచు
2014లో వచ్చిన చందమామ కథలకు గాను మంచు లక్ష్మీకి బెస్ట్ కారెక్డర్ అవార్డు వచ్చింది. ఈమె బాలకృష్ణకు మంచి ఫ్రెండ్ అని అని పేర్కొన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉండే, నందమూరి కుటుంబం గ్రామం నుంచే వచ్చిన రాజేంద్ర ప్రసాద్కు టామీ సినిమాకు గాను బెస్ట్ క్యారెక్టర్ అవార్డు వచ్చింది.
ఎస్ఎస్ రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళికి బాహుబలి సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఆయన రాజధాని అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నారు. అలాగే, లెజెండ్ సినిమాతో పాటు హితుడు సినిమాకు జగపతి బాబుకు అవార్డులు వచ్చాయి.
లౌక్యం, అశ్వినీదత్లకు
2014 బెస్ట్ పాపులర్ సినిమా అవార్డును లౌక్యం సినిమా దక్కించుకుంది. ఈ సినిమా నిర్మాత వీ ఆనంద్. అతను బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా తీశారని పేర్కొన్నారు. అలాగే ఒకే కమ్యూనిటీకి చెందిన అశ్వనీదత్ కూతురుకు, క్రిష్కు, కొరటాల శివలకు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు.
వీటిని తప్పుబట్టడం లేదు కానీ
ఇదిలా ఉండగా, బాలకృష్ణకు (ఉత్తమ నటుడు), బాహుబలి సినిమాకు (ఉత్తమ డైరెక్టర్), హిట్గా నిలిచిన లౌక్యం సినిమాకు, శ్రీమంతుడులో ఉత్తమ నటుడిగా మహేష్ బాబుకు అవార్డులు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ ఓ కమ్యూనిటీకి ఎక్కువగా వచ్చాయని, లెజెండ్ సినిమాకు అన్ని అవార్డులు రావడం ఏమిటని, మనం, రుద్రమదేవి, రేసు గుర్రం వంటి సినిమాలకు రాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్కు బెస్ట్ క్యారెక్టర్ అవార్డు ఇవ్వడం రుచించడం లేదని అంటున్నారు. ఇక్కడ అల్లు అర్జున్ను హీరోగానే చూస్తున్నారు తప్ప, నటుడిగా ఆయనకు వచ్చిందనే విషయం గుర్తించడం లేదనే వారు కూడా ఉన్నారు.