రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కు వెళ్లారు: గంటాపై రోజా
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య బుధవారం తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాస రావు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా - రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయం చూడకుండా మంత్రి గంటా శ్రీనివాస రావు శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్కు వెళ్లారని ఆరోపించారు.
తాను ఆడియో ఫంక్షన్కు వెళ్లిన మాట నిజమేనని, ఆయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల మాదిరిగా తాము పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలు చేయలేదమని, సమస్యలు ఉంటే తాము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి చెప్పారు. రిషికేశ్వరి ఆత్మహత్యపై అంతకు ముందు జరిగిన చర్చలో రోజా చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఖండించారు.
ర్యాగింగ్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. రోజా రాజకీయ ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. స్టాప్ ర్యాగింగ్ చట్టాన్ని తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనలో ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారని, సంఘటనకు బాధ్యులైనవారిని ఉపేక్షిస్తున్నారని రోజా విమర్శించారు. ప్రిన్సిపాల్ బాబూరావును కాపాడుతున్నారని ఆమె అన్నారు.
రిషితేశ్వరి ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరమని బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. విశ్వవిద్యాలయంలో ఓ ఆడపిల్ల ఆత్మహత్య బారిన పడడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి చిన రాజప్ప - రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరుగుతోందని, బాబూరావు పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగకుండా ఉండాల్సిందని ఆయన అన్నారు. బాబూరావును పదవి నుంచి తొలగించామని చెప్పారు. పూర్వ విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బయటకు పంపించామని చెప్పారు. సంఘటనలో ఇప్పటి వరకు వీడియో ఆధారాలు లభించలేదని అన్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రతి సంఘటననూ రాజకీయం చేయాలని చూడడం మంచిది కాదని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో కమిటీ 172 మందిని విచారించిందని ఆయన చెప్పారు. ర్యాగింగ్ చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తెస్తున్నట్లు చెప్పారు. సంఘటనను దయచేసి రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఘటనకు బాధులైనవారు బాబూరావా, మరొకరా అనేది ప్రభుత్వానికి అవసరం లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
గంటా శ్రీనివాస రావు సమాధానంతో సంతృప్తి చెందని రోజా - మంత్రి చెప్పినట్లు జరిగితే సంతోషిస్తామని అన్నారు. బాబూరావు తాగి ఎలా తందనాలు ఆడాడో బయటపడిందని, కమిటీ నివేదికలో కూడా బాబూరావు విషయాలు వెలుగు చూశాయని ఆమె చెప్పారు. హోటల్లోకి రిషితేశ్వరి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారని ఆమె గంటాపై విమర్శ చేశారు. ఈ వ్యాఖ్యను మంత్రి గంటా ఖండించారు.
నారాయణ కాలేజీలో 11 మంది మరణించారని, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని రోజా విమర్శించారు. రోజా చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం కాస్తా ఇబ్బందిగా ఉందంటూ తాము తీసుకున్న చర్యలను గంటా వివరించారు. విశ్వవిద్యాలయంలో అటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, ఇటువంటి ఘటనలు కాలేజీల్లో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు.