విశాఖలో దారుణం... ఫుట్పాత్పై రౌడీషీటర్ దారుణ హత్య... కత్తులతో పొడిచి...
విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. మద్దిలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం వద్ద వెంకట్ రెడ్డి అలియాస్ బండ రెడ్డి అనే రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. మంగళవారం(ఫిబ్రవరి 23) రాత్రి 8.23గం. సమయంలో ఈ హత్య చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
బండరెడ్డి కేఈఆర్ఎం కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి తన నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డు పక్కన ఫుట్పాత్పై కూర్చొన్నాడు. ఇంతలో అక్కడికి ఓ బైక్,ఓ కారు వచ్చాయి. నలుగురు వ్యక్తులు రాడ్లు,కత్తులతో బండరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బండరెడ్డి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడివున్న బండరెడ్డిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బండరెడ్డి రౌడీ షీటర్ అని,అతనికి గతంలో నేర చరిత్ర ఉందని చెప్పారు. సుపారీ తీసుకుని నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. గతంలో రెండు హత్య కేసుల్లో అతని పాత్ర ఉన్నట్లు తేలిందన్నారు. బండరెడ్డికి,అతని గ్యాంగ్లోనే పనిచేసిన కొంతమంది వ్యక్తులకు కొన్నాళ్లుగా విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలే హత్యకు దారితీసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గతేడాది డిసెంబర్లో ఇదే విశాఖపట్నంలోని అరిలోవలో కోరాడ సాయి అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితులు అతన్ని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.గంజాయి పంపకాల్లో తలెత్తిన విభేదాలే హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు.