లొంగుబాటా? అరెస్టా? : ఆర్పీఎఫ్ పోలీసుల అదుపులో ముద్రగడ!
కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కొందరు వ్యక్తులను పిలవగా.. వారితో పాటు ముద్రగడ కూడా వచ్చారని ఆయన చెప్పారు.
విశాఖపట్నం: తుని విధ్వంస ఘటనకు సంబంధించి అనకాపల్లి రైల్వే కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
అనకాపల్లిలోని ఓ హోటల్ లో ముద్రగడ ఉన్నారన్న సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ భద్రతా దళాలు.. నేరుగా హోటల్కు వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. తుని సభ సందర్బంగా.. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విధ్వంసానికి సంబంధించి రైల్వే పోలీసులు ముద్రగడను కుట్రదారుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజా అరెస్టు నేపథ్యంలో.. అప్పటి విధ్వంసానికి సంబంధించి ఆయన్ను మరోసారి విచారించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముద్రగడను అరెస్టు చేయలేదంటూ రైల్వే డీఎస్పీ ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కొందరు వ్యక్తులను పిలవగా.. వారితో పాటు ముద్రగడ కూడా వచ్చారని ఆయన చెప్పారు. వచ్చినవారిలో కుల రామకృష్ణ, చెల్లా ప్రభాకర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
ఓవైపు ఆర్పీఎఫ్ పోలీసులు ముద్రగడను అరెస్టు చేశారని.. అనకాపల్లి అంతటా వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు డీఎస్పీ ప్రకటన ఇందుకు విరుద్దంగా ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. దీంతొ అనుచరులతో పాటు వచ్చి ముద్రగడనే లొంగిపోయరా? లేక పోలీసులే అదుపులోకి తీసుకున్నారా? అన్న విషయంపై పూర్తి స్థాయి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.