లాటరీ పేరుతో వ్యక్తి నుంచి రూ.1.30 కోట్లు స్వాహా...మరో వైపు రైస్ పుల్లింగ్ ముఠా అరెస్ట్
పశ్చిమ గోదావరి: రూ.1.77 కోట్లు లాటరీ తగిలిందని ఎవరో ఫోన్ చేసి చెబితే...అది సొంతం చేసుకోవడానికి(అవతలివాడు ఏం చెప్పినా సరే) రూ.1.30 కోట్లు డబ్బులు కట్టమంటే ఎవరైనా కడతారా?...ఎందుకు కట్టరు!...భేషుగ్గా కట్టేవాళ్లున్నారు...ఏంటి?...మీకు నమ్మకం లేదా?...అయితే అలా కట్టి మోసపోయిన వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాల్సిందే!
సరే...మరో రకమైన ఛీటింగ్...రైస్ పుల్లింగ్ గురించి...దీని పేరుతో ఎన్నో ముఠాలు జనాలను మోసగించిన తీరు గురించి మీరు గడిచిన పదేళ్లలో ఎన్నో వార్తలు పేపర్లలో చదవడం...టివిల్లో చూడటం చేసివుంటారు. అయినా అవే మాటలతో...అలాగే ఇంకా జనం మోసపోవడాన్ని గురించి మీరేమంటారు...బహుశా...వాళ్లు పేపర్లు చదివేవాళ్లు,టివిలు చూసేవాళ్లు కాదేమో అనుకుంటున్నారా?...ఆ విషయం వాళ్లే చెప్పాలి...ఇంతకీ ఏం జరిగిందంటే?...
ఫోన్ లాటరీ అంటూ...ఆన్ లైన్ మోసం
పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం గుడిపాడుకు చెందిన మోరు నరసింహారావు అనే వ్యక్తికి ఈ ఏడాది జూలై 21న నాప్టోల్ కంపెనీ నుంచి అంటూ ఫోన్ కాల్ వచ్చింది. "మా కంపెనీ డ్రాలో మీరు టాటా సఫారీ కారును గెల్చుకున్నారు...అలాగే మీరు చేసిన షాపింగ్లో మీ ఫోన్ నంబరుకు రూ.1.77 కోట్లు లాటరీ తగిలింది. వాటికి సంబంధించి ఆర్బీఐ స్టాంపు వేసిన రూ.100 బాండ్ పేపర్లు మాకు వచ్చాయి. టాక్స్ కట్టేసి ఈ రెండు బహుమతులు తీసుకోండి...అంటూ ఆ ఫోన్ చేసిన వ్యక్తులు మాట్లాడారు.
డబ్బులు...వేస్తూనే ఉన్నాడు
తనకు నిజంగానే లాటరీ తగిలిందని నమ్మిన నరసింహారావు ముందుగా వాళ్లు చెప్పినట్లుగా రూ.25 వేలు డబ్బులు వేశాడు. దీంతో ఇతడు తమ మాటలు నమ్మాడని నిర్ధారించుకున్న అవతలి వ్యక్తులు అది మొదలుకొని వివిధ రకాల టాక్స్ ల పేర్లు చెప్పి వాళ్ల ఖాతాకి వేయించుకున్న డబ్బు...అక్షరాలా ఒక కోటి 30 లక్షల 48 వేల 863 రూపాయాలు. అంత డబ్బు ఆన్లైన్లో చెల్లించాక ఇంకా బహమతులు అందివ్వకపోవడంపై నరసింహారావు గట్టిగా అడుగుతుండటంతో ఇక అవతలి వాళ్లు ఫోన్ స్విఛ్చాఫ్ చేసేశారు. దీంతో తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన నరసింహారావు ఆదివారం పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో మోసం...రైస్ పుల్లింగ్ ముఠా...
ఇదే జిల్లాలో మరోవైపు అతీంద్రియ శక్తుల పేరిట అమాయక జనాన్ని దోచుకుంటున్న ఓ రైస్ పుల్లింగ్ ముఠాను తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మూర్తి చెప్పిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గుర్రం వెంకటేశ్వరరావు, అతుకూరి సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు రైస్ పుల్లింగ్ పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి వీలైనంతమేరకు దోచేస్తున్నారు. ఇదే క్రమంలో తమ వద్ద మహిమలు ఉన్న అతీంద్రియ శక్తులున్న చెంబు ఉందని, అది ఎవరి వద్ద ఉంటే వారిని సిరులు వెతుక్కుంటూ వస్తాయంటూ ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కోమటి రాంబాబు అనే వ్యక్తి నుంచి నుంచి వీరు రూ.లక్షన్నర తీసుకుని మోసంచేశారు.
మోసగాడిని బంధించి...తానూ అదే మోసం
అయితే వీళ్ల మోసం గ్రహించి ఆగ్రహించిన రాంబాబు...తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ గుర్రం వెంకటేశ్వరరావును తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులో ఉన్న తన ఫ్లాట్లో 70రోజులు బంధించాడు. దీంతో వెంకటేశ్వరరావు తన తప్పును ఒప్పుకుని, రాంబాబుకు తాను డబ్బు తిరిగి ఇవ్వలేనని...అయితే డబ్బులు తిరిగి వచ్చే మార్గం చెబుతానంటూ అతనికి ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్రకారం విద్యుత్ తరంగాల ద్వారా రైస్ పుల్లింగ్ కనికట్టు చేసేందుకు గాను రూ.50 వేలతో మైక్రో ఓవెన్, ఇతర విద్యుత్తు పరికరాలు కొన్ని కొనిపించాడు.
చివరకు ఇలా...ఆట కట్టయింది
వాటితో రాంబాబు ప్లాట్లోని టైల్స్ తీయించి ఈ టెక్నాలజీ సెట్ చేసి నేలపై చెంబు పెట్టి రైస్ పుల్లింగ్ ఎఫెక్ట్ వచ్చేలా టెక్నిక్ అప్లై చేసి ఉంచారు. అలా గుంటూరు జిల్లాకు చెందిన చిన్నకేశవులు నుంచి రూ.2 లక్షలు, యర్రంశెట్టి సదాశివరావు అనే వ్యక్తుల నుంచి రూ.4 లక్షల నగదు దోచేశారు. అయితే తనకు రావాల్సిన డబ్బులు వచ్చినా వెంకటేశ్వరరావుని వదలకుండా తమతోనే ఉంచడంతో అతడు ఒక సిగిరెట్ ముక్కపై తన పరిస్థితి రాసి ఆటో డ్రైవర్ వైపు విసరగా, దాన్ని చదివిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అలా ఈ ముఠా ఆటకట్టయింది.