రూ. 1.5కోట్ల ఉపాధి నిధులు మాయం: పోస్ట్ మాస్టర్దే కీలక పాత్ర?
శ్రీకాకుళం: జిల్లాలోని గార పట్టణంలోని పోస్టఫీసులో ఉపాధి హామీ పనులకు సంబంధించిన రూ.1.5 కోట్ల నిధులు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది.
విషయం తెలిసిన వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్ గురువారం ఉదయం గార నగరానికి వచ్చి సబ్ పోస్ట్ మాస్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
పోస్టల్ ఉన్నతాధికారులందరూ గారకు వచ్చారు. పోస్టాఫీస్ తలుపులు మూసి రికార్డులు తనిఖీ చేశారు. మీడియా వాళ్లను లోపలికి అనుమతించలేదు. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన నిధులు రూ.1.5 కోట్ల రూపాయలు గల్లంతైనట్లు తేల్చారు. బినామీ పేర్లతో డ్రా చేసినట్లు తేలింది.
లభ్దిదారులు తమ డబ్బుల కోసం వెళ్తే ఇంతకు ముందే తీసుకున్నారని సమాధానం రావడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సబ్ పోస్ట్ మాస్టరే నిధులు నొక్కేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.
ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
చిత్తూరు జిల్లా నాగలాపురం పంచాయుతీరాజ్ ఏఈ ఈశ్వర్బాబు బుధవారం సాయుంత్రం రూ.25 వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగలో హర్షవర్దన్ప్రసాద్ రూ.3.60 లక్షల విలువ చేసే చెక్డ్యాం పనులు చేశాడు.
ఇందుకు సంబంధించి రూ.2.2 లక్షల బిల్లు పొందాడు. మిగిలిన బిల్లును రెండో విడతగా పొందాల్సి ఉంది. అయితే పంచాయతీరాజ్ ఏఈ ఈశ్వరబాబు రూ.30 వేలు డివూండ్ చేయగా హర్షవర్ధన్ప్రసాద్ రూ.25 వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సుధాకర్రెడ్డి, లక్ష్మీకాంతన్ బుధవారం సాయంత్రం దాడులు చేశారు. దాడుల్లో పట్టబడ్డ ఏఈ ఈశ్వర్బాబును నెల్లూరు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.