విశాఖలో హవాలా: రూ. కోటి నగదు, 29 కిలోల వెండి స్వాధీనం, 100 కిలోల గంజాయి కూడా
విశాఖపట్నం: నగరంలో హవాలా నగదు కలకలం రేపుతోంది. హవాలా నగదును తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు టాక్స్ ఫోర్స్ అధికారులు. రాజస్థాన్కు చెందిన ఇద్దరి నుంచి టాస్క్ఫోర్స్ పోలీసులు కోటి రూపాయల నగదు, 29 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ ప్రేమ్ కాజల్ వెల్లడించారు.
100 కిలోల గంజాయి స్వాధీనం..
యాంటీ డ్రగ్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ. కోటి నగదు, 29.415 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక ప్రాంతంలోని దువ్వాడ రైల్వే బ్రిడ్జి వద్ద పోలీసులు యాంటీ డ్రగ్ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఓ ఇన్నోవా కారులో 100 కిలోల గంజాయిని గుర్తించారు. కారు డ్రైవర్ గౌరవ్(25)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సుబ్బారెడ్డి అలియాస్ సురేష్ తప్పించుకున్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
29 కిలోల వెండి సీజ్..
మరోవైపు విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లిపురం ప్రాంతంలోని ఓ లాడ్జిలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వారు ఉంటున్న గదిలో తనిఖీలు నిర్వహించగా రెండు బ్యాగుల్లో 29.415 కిలోల వెండి పట్టీలు, కుంకుమ భరిణెలు, ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నిందితులు హిమత్ సింగ్ రాథోడ్, సోహన్ సింగ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ. కోటి నగదు హవాలా..
అల్లిపురం బైడరా రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన తనిఖీల్లో భరత్ కుమార్, రాజ్ పురోహిత్, చోటారామ్ల అనే వ్యక్తుల వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును గుర్తించి తనిఖీలు చేయగా రూ. కోటి నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదు సంబంధించి సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.