నల్లధనం ఫైట్: బాబుకు ఎదురు తిరిగిందా, మరో అడుగేసి.. జగన్ తొందరపడ్డారా?
అమరావతి: ఏపీలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య 'నల్ల' యుద్ధం కొనసాగుతోంది. బ్లాక్ మనీ పైన ఒకరి పైన మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నల్లధనం ఆరోపణలు చంద్రబాబుకు ఎదురు తిరిగాయా లేక జగన్ తొందరపడ్డారా అనే చర్చ సాగుతోంది.
నల్లధనం విషయమై చంద్రబాబు, జగన్లు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా ఇటీవల నల్లధనం వెల్లడించిన వారిలో హైదరాబాదుకు చెందిన వారు ఉన్నారని, మొత్తం రూ.63వేల కోట్ల నల్లధనం దేశవ్యాప్తంగా వెల్లడించగా, హైదరాబాద్ నుంచి రూ.13 వేల కోట్లు ఉన్నాయని టిడిపి నేతలు చెప్పారు.
అందులో ఒక్క వ్యక్తివే రూ.10వేల కోట్లు ఉన్నాయని చంద్రబాబు సహా టిడిపి నేతలు, మంత్రులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎవరి పేరు చెప్పనప్పటికీ.. ఒక్క వ్యక్తివే అని చెప్పారు. అది ఆయన జగన్ను ఉద్దేశించేనని అంటున్నారు. చంద్రబాబుకు ముందు, ఆ తర్వాత పలువురు మంత్రులు, నేతలు ఏకంగా జగన్ పేరును లాగారు.
హైదరాబాదుకు చెందిన ఒక వ్యక్తి రూ.10వేల కోట్లు వెల్లడించారని, అది జగనేనని మండిపడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయన పేరు చెప్పలేదు.
పాయింట్ లాగిన వైసీపీ
అదే సమయంలో నల్లధనం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ లాగింది. ఐడీఎస్ (ఇన్కమ్ డిక్లరేషన్ స్కీం) ప్రకారం నల్లధనం వెల్లడించిన వారి పేర్లు బయట పెట్టవద్దని, అలాంటప్పుడు చంద్రబాబుకు, టిడిపి నేతలకు హైదరాబాద్ నుంచి రూ.13 వేల కోట్ల నల్లధనం ఉందని ఎలా తెలిసిందని ప్రశ్నిస్తున్నారు.
జగన్ను టార్గెట్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా టీడీపీ నేతలు ఈ కుట్రకు తెరలేపారని మండిపడుతున్నారు. జగన్ మరో అడుగు ముందుకేసి.. అసలు నల్లధనం ఎవరు, ఎక్కడి నుంచి, ఎంత ఇచ్చారని చెప్పవద్దని తెలిపినప్పుడు.. చంద్రబాబుకు, టిడిపి నేతలకు తెలిసిందంటే.. అది ఎలా తెలిసిందో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీ ఉంటేనే అది తెలిసి ఉండాలని ముఖ్యమంత్రిని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఐడీఎస్ జాబితాను విడుదల చేయాలని ఈ సందర్భంగా జగన్ డిమాండ్ చేశారు.
టిడిపి కౌంటర్
హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి రూ.10వేల కోట్లు వెల్లడించాడని చంద్రబాబు చెప్పారని, కానీ జగన్ పేరు ఎక్కడా చెప్పలేదని, అలాంటప్పుడు ఆయన ఎందుకు ఉలిక్కి పడుతున్నారనేది టిడిపి వాదన. అంటే జగన్ వద్ద నల్లధనం ఉంది కాబట్టే ఆయన స్పందిస్తున్నారని అంటున్నారు. అయితే మంత్రులు జగన్ పేరు చెప్పారని వైసిపి చెబుతోంది.