అత్యాచార బాధితురాలికి పరిహారం...నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న హోంమంత్రి
ఒంగోలు: తల్లిదండ్రుల కంటే మించిన శ్రేయోభిలాషులు మరొకరు ఉండరని ఏపీ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ విషయాన్ని పిల్లలు గుర్తించాలని చెప్పారు. అత్యాచారానికి గురైన బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారంతో పాటు బాలికకు భద్రత కల్పిస్తామని సుచరిత అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని మేకతోటి సుచరిత అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పటికే అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి చెప్పారు.
అత్యాచారం చేసిన వారు ఎంతటివారైనా సరే శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. బాధితురాలి ఫిర్యాదు అందగానే ఎస్పీ సారథ్యంలో నిందితులను వెంటనే పట్టుకోవడం జరిగిందన్నారు. శక్తి టీమ్ వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. సీఎం జగన్ ఇప్పటికే ఘటనపై ఆరా తీశారని బాధితురాలి భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారని సుచరితా చెప్పారు. మహిళల భద్రతపట్ల ప్రభుత్వం చాలా బాధ్యతతో వ్యవహరిస్తోందని గుర్తుచేశారు హోంమంత్రి. ఇక బాలికలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు రాకూడదని సూచించారు.
మహిళలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నకానీ 100 నెంబరుకు ఫోన్ చేయాలని సుచరితా చెప్పారు. మహిళల భద్రతకు రాష్ఠ్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు బాలికలు ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలికలకు కరాటే క్లాసులు నిర్వహిస్తామని మేకతోటి సుచరిత చెప్పారు. ఒంగోలులో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు బాలికను నిర్బంధించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.