ప్రకాశం జిల్లా ట్రెజరీలో...నిలిచిపోయిన రూ.100 కోట్లు:ఉద్యోగుల ఇక్కట్లు
ప్రకాశం జిల్లా:డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ నుంచి డ్రాయింగ్ ఆఫీసర్స్ ఖాతాల్లో పడాల్సిన వివిధ రకాల బిల్లులకు సంబంధించిన దాదాపు రూ.100 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నుంచి ట్రెజరీలో ప్రవేశపెట్టిన కంప్రెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) అనే నూతన విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
దీంతో పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, మెడికల్, న్యాయ విభాగం, ఎల్ఐసీతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. ప్రభుత్వం ఖజానా కార్యాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్ఎంఎస్ విధానం సాంకేతిక సమస్యల కారణంగా ముందుకు సాగడం లేదు. దీంతో జిల్లాలో ప్రభుత్వ ప్రధాన శాఖల ఉద్యోగుల తో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎయిడెడ్ స్కూలు ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్ శాఖల్లో పనిచేసే వర్క్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు ఇలా చాలామంది పాత బకాయిలు కూడా రాక మూడు నెలలుగా వేతనాలు అందని పరిస్థితి నెలకొంది.
వీరికి వేతనాలు, బకాయిలతో పాటు పంచాయతీల నిధులు, మండల పరిషత్ నిధులు, జిల్లా పరిషత్కు సంబంధించిన నిధులు, ఇతర అభివృద్ధి పథకాలకు నిధులు ఇలా అన్నీ వరుసగా నిలిచిపోయాయి. ఈ శాఖలకు సంబంధించిన పీడీ అకౌంట్లోకి చెక్కుల పర్మిషన్ నిలిచిపోవడంతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకుండా పోయింది. చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్స్, ఎంప్లాయిస్కు సంబంధించిన మట్టి ఖర్చులు, పెన్షన్ బకాయిలు రాలేదని తెలిసింది. దాదాపు 182 ప్రభుత్వ శాఖల వరకు ఉండగా వాటిలో ఇప్పటి వరకు కేవలం 95 శాఖలకే ఆయా శాఖాధిపతుల నుంచి డేటా సీఎఫ్ఎంఎస్ విధానంలో ధృవీకరించడం కోసం అనుమతి లభించినట్లు ట్రెజరీ సిబ్బంది తెలిపారు.
ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సబ్ ట్రెజరీ ఆఫీసులు ఉన్నాయి. అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో ఈ సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 37,647 మంది ఉద్యోగులు, 21,398 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీరు గాక ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఖజానా శాఖ ద్వారా వేతనాలు, పెన్షన్లను ప్రతి నెలా పొందుతుంటారు. ప్రతి నెల రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. అలాగే సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో వివిధ రకాల బిల్లులు మంజూరుల కోసం వస్తుంటాయి. అయితే నూతన విధానం కారణంగా డబ్బులు రాక ఎంతోమంది ఉద్యోగులు, అధికారులు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.