రాజధాని తరలింపు ఆలస్యం - అమరావతిపై జగన్ సర్కార్ దృష్టి- రూ.18 వేల కోట్ల ప్లాన్...
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి అమరావతిలో అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు తయారు చేసిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీన్ని అమల్లో పెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.
హైదరాబాద్ టూ అమరావతి ప్రత్యేక బస్సులు- ఆ 400 మంది కోసమే...
రాజధాని తరలింపు ఆలస్యం....
ఏపీలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించినా మండలిలో బ్రేక్ పడటంతో ఈ వ్యవహారం వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ కూడా ప్రభుత్వ ప్రణాళికలకు ఆటంకంగా మారింది. మారిన పరిస్దితుల్లో విశాఖకు రాజధాని తరలింపు వచ్చే ఏడాది చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు విశాఖలో రాజధాని ప్రణాళికలు కూడా ఆలస్యమవుతున్నాయి.
అమరావతిపై జగన్ దృష్టి...
విశాఖకు రాజధాని తరలింపు ఆలస్యమవుతున్న తరుణంలో ఆ లోపు చట్టసభల రాజధానిగా ఉండబోతున్న అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమరావతిలో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు, వాటిని పూర్తిచేసేందుకు అయ్యే ఖర్చుపై సీఆర్డీఏ నుంచి సీఎం జగన్ నివేదిక తెప్పించుకున్నారు. అమరావతిలో ప్రస్తుతం అర్దాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పూర్తికి రూ.18 వేల కోట్లు ఖర్చవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. ఈ నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే అమరావతి ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కడం ఖాయం.
అమరావతిలో పనుల కుదింపు...
అమరావతిలో గతంలో రూపొందించిన ప్రణాళికలను కుదించి చూస్తే ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల పూర్తికి రూ.18 వేల కోట్లు ఖర్చువుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. అమరావతి ప్రాజెక్టుల కుదింపు, రివర్స్ టెండరింగ్ అవకాశాలపై ఇప్పటికే ఐఐటీ రూర్కెలా బృందం క్షేత్రస్ధాయిలో పర్యటించి రూపొందిన నివేదిక ఆధారంగా సీఆర్డీఏ ఈ అంచనాకు వచ్చింది. వీటి అమలు కోసం దశల వారీగా పనులు చేపడితే బావుంటుందని సీఎం జగన్ కు అధికారులు నివేదించారు.
అమరావతి ఉద్యమాలకు చెక్...
గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచీ అమరావతి రాజధానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియకు ప్రభుత్వం తెరలేపగానే ఇక్కడ ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. అయితే వీటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన ప్రభుత్వం దీర్ఘకాలంగా ఇబ్బందులను నివారించేందుకు అమరావతిని ప్రభుత్వం చిన్నచూపు చూడటం లేదని చెప్పేందుకు వీలుగా ప్రస్తుతం జరుగుతున్న పనులను కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓసారి ఈ పనులు తిరిగి ప్రారంభమైతే అమరావతి రైతుల్లో భయాలు తొలగిపోయి ఉద్యమాలకు కూడా చెక్ పడుతుందనేది ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది.