జవాన్ ముస్తాక్ ఫ్యామిలీకి రూ.25 లక్షలు: కులాల పేరుతో అరాచకం చేస్తే.. బాబు హెచ్చరిక
విజయవాడ/హైదరాబాద్: సియాచిన్లో మంచు చరియలు విరగిపడి మృతి చెందిన కర్నూలు జిల్లా వీర జవాను ముస్తాక్ అహ్మద్కు ఏపీ మంత్రివర్గం నివాళులర్పించింది. ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.
విజయవాడలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఇసుక విధానం, జలవనరుల ప్రాజెక్టులు, ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ప్రోత్సాహం తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గం ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలపై సర్వే చేపట్టి, దానికి అనుగుణంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపడతామని చంద్రబాబు చెప్పారు. దామాషా పద్ధతిలో ప్రతి సామాజిక వర్గం ప్రభుత్వ ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యాకులుగా వాల్మీకీ - బోయ కులస్తులను ఎస్టీలుగా గుర్తించే అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. వాల్మీకి, బోయ సామాజిక వర్గ ప్రతినిధులు సోమవారం చంద్రబాబును కలిశారు.
బీసీ ఏ జాబితాలో ఉన్న తమను కర్నాటక మాదిరిగా ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం ఇచ్చారు. మేనిఫెస్టోలోను ఇచ్చిన హామీ మేరకు తమను ఎస్టీలుగా గుర్తించాలన్నారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో సంప్రదించి ఎస్టీ రిజర్వేషన్ ఎలా కల్పించాలనే దానిపా స్పష్టత తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ఆందోళనలు చేస్తే రాష్ట్రాభివృద్ధి నిలిచిపోతుందని, పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రారని చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు రాకుంటే ఉద్యోగాలు ఉండవని, సంపదను సృష్టించలేమన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో అరాచకాలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బేగంపేట నుంచి పార్నెపల్లికి ముస్తాక్ మృతదేహం
వీర జవాన్ ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం బేగం విమానాశ్రయానికి చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్న భౌతికకాయానికి బేగంపేట విమానాశ్రయంలో ఆర్మీ, పోలీసు అధికారులు నివాళులర్పించారు.
పలువురు రాజకీయ నాయకులు కూడా ముస్తాక్ అహ్మద్ భౌతికకాయానికి నివాళులర్పించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన అతడి స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాలకు తరలిస్తున్నారు. రేపు స్వగ్రామం పార్నపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి వరకు స్వగ్రామం చేరుకోనుంది.