ఏపీకి కేంద్రం శుభవార్త: టీటీడీకి జీఎస్టీ ఊరట, ఇక నుంచి ఆ పన్ను వెనక్కి
న్యూఢిల్లీ/తిరుమల: ఏపీకి కేంద్రం శుభవార్త తెలిపింది. జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం శనివారం ధార్మిక, మత సంస్థలతో పాటు ఆలయాలకు సీజీఎస్టీ, ఐజీఎస్టీ సొమ్మును తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. సేవా భోజ్ యోజన పథకం కింద భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందించే ఆలయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
ఇందులో భాగంగా భక్తుల అన్నప్రసాదాల కోసం కొనుగోలుచేసే ముడి సరుకులపై ఇక జీఎస్టీ ఉండదు. జీఎస్టీ మినహాయింపుతో టీటీడీకి ఏడాదికి రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.
కాగా, సేవా భోజన యోజన పథకం కోసం కేంద్రం రూ.325 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తుంది. దీనిపై త్వరలోనే పూర్తి విధివిధానాలు ఖరారు చేస్తారు. ఈ పథకంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గరిష్ఠంగా జీఎస్టీ పన్ను నుంచి మినహాయింపు పొందనున్నాయి. ముడి సరకుల కొనుగోలులో జీఎస్టీని ఆయా సంస్థలకు తిరిగి చెల్లిస్తారు. అయితే ముడి పదార్థాలను గుత్తేదారులు కాకుండా ఆధ్యాత్మిక సంస్థలు పంపిణీ చేస్తేనే ఈ నిబంధన వర్తిస్తుంది.
దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటా ముడి పదార్థాలకు చెల్లించే సొమ్ము వెనక్కి వస్తుంది. ఏటా టీటీడీ దీనికోసం రూ.96 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. ఇందులో సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకూ టీటీడీకి తిరిగే వచ్చే అవకాశముంది. ఇప్పటికే ప్రసాదాలపై జీఎస్టీని కేంద్రం మినహాయించింది.