రూ.30 లక్షల విలువైన చేపలు మృతి:విష ప్రయోగమే కారణమా?
కృష్ణా జిల్లా: పెనుమలూరు గ్రామంలోని పేరంటాలమ్మ చెరువులో లక్షల విలువ చేసే చేపలు మృత్యువాతన పడటం కలకలం రేపింది. కొందరు కావాలని కుట్రపూరితంగా విషప్రయోగం జరగటంతో టన్నుల కొద్ది చేపలు చనిపోయాయని చెరువు లీజుదారులు చెబుతున్నారు.
దీంతో తమకు న్యాయం చేయాలంటూ లీజుదారులు గ్రామస్థులతో కలసి ఆందోళనకు దిగారు. అయితే విషప్రయోగం వంటిదేమీ లేదని ఇటీవల కురిసిన వర్షాలకు మురికినీరు చెరువులోకి చేరడం వలన కాలుష్యం ప్రభావంతో చేపలు చనిపోయాయని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ వివాదం గ్రామంలో గొడవలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ చేపలు చనిపోయిన చెరువు లీజు వ్యవహారంపై కొంతకాలంగా హైకోర్డులో కేసులు నడుస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మరో నెల రోజులలో చేపలు చేతికి వస్తాయనగా ఈ దారుణం చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. చనిపోయిన చేపల వల్ల రూ.30 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇలా చెరువులో చేపలు మొత్తం చనిపోయాయని తెలియడంతో 120 కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు.
పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గంపై విమర్శల వర్షం కురిపించారు. కేవలం పంచాయతీ నిర్లక్ష్యం కారణంగానే చేపలు చనిపోయాయని వారు ఆరోపించారు. దీనివెనుక కుట్ర కూడా ఉందని...దీనిపై విచారణ జరపాలని, నష్టపోయిన కుటుంబాలకు సాయం చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.