రూ. 50 లక్షల కరోనా బీమా: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, కార్మికుల హర్షం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని కార్మికులకు వర్తింపజేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కరోనా బారినపడి ఇప్పటివరకు మృతి చెందిన 36 మందికి బీమా అమలయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు మృతుల వివరాలతోపాటు ధృవపత్రాలు పంపాలని ఆర్ఎంలని ఆర్టీసీ ఎండీ ఆదేశించారు.
ఆగస్టు 28లోపు ధృవపత్రాలను ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కరోనా బీమా వర్తింపజేయడంపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలిపాయి. కరోనా వ్యాపిస్తున్న క్రమంలో విధులు నిర్వహిస్తున్న తమకు కోవిడ్ బీమా అండగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశాయి.
తాజాగా ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 57,685 మందిని పరీక్షించగా.. 9742 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. తాజాగా నమోదైన 9742 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,19,296 పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 86 మంది మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 15 మంది చొప్పున, అనంతపురంలో 8 మంది, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడపలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మరణించారు.