గుట్టలుగా వజ్రాలు, బంగారు ఆభరణాలు: భారీగా హవాలా: అండర్ గ్రౌండ్ లోనే వారిద్దరూ
చిత్తూరు: వందల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని అక్రమంగా ఆర్జించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న కల్కి భగవాన్ కు చెందిన ఏకాం ఆలయంలో భారీగా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. 500 కోట్ల రూపాయలకు పైగా నగదు, 43.9 కోట్ల రూపాయల నగదు, 18 కోట్ల రూపాయల విలువ చేసే అమెరికన్ డాలర్లు, 500 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారుల దాడులు ముగిసిన నేపథ్యంలో వారు ఒక ప్రకటన విడుదల చేశారు.
'జగన్ కోర్టుకు హాజరైతే రూ. 60లక్షల ఖర్చా..? నిబద్ధత ఉంటే ఇలా చేయండి'
1271 వజ్ర వైఢూర్యాలు, 88 కేజీల బంగారు ఆభరణాలు..
కల్కి భగవాన్ ఆశ్రమంలో అక్రమంగా దాచి ఉంచిన 1271 వజ్రాలు, వేర్వేరు క్యాంపస్ లల్లో దాచి ఉంచిన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాల బరువు 88లకు పైమాటేనని వెల్లడించారు. 500 కోట్ల రూపాయలకు పైగా నగదును సీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటకల్లో కల్కి భగవాన్ ఆశ్రమానికి చెందిన 40 ప్రాంతాల్లో నివాసాలు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల సందర్భంగా వాటిని స్వాధీంన చేసుకున్నామని తెలిపారు. కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు, ఆయన భార్య భక్తుల నుంచి అందిన విరాళాలు, అక్రమ వ్యాపారాల ద్వారా ఈ మొత్తాన్ని కూడబెట్టినట్లు తేలింది.
విదేశాల్లో పెట్టుబడులు..
కల్కి భగవాన్, కల్కి ఆశ్రమం, కొందరు బినామీల పేర్ల మీద విదేశాల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసినట్లు తేలింది.
ఇప్పటికే ఆఫ్రికా, ఖతర్ లల్లో భారీగా వ్యవసాయ పొలాలను కొన్నట్లు అధికారులు గుర్తించారు. అమెరికా, చైనా, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియాలో కొన్ని ప్రముఖ నగరాల్లోనూ వివిధ సంస్థల్లో భారీగా పెట్టుబడులను పెట్టినట్లు వెల్లడించారు. కొన్ని ప్రముఖ సంస్థల్లో వాటాలు ఉన్నట్టు స్పష్టమైంది. ఆశ్రమానికి వచ్చే విదేశీ భక్తుల సహకారంతో విరాళాలకు బదులుగా కొన్ని సంస్థల్లో ఆశ్రమానికి భాగస్వామ్యం లభించేలా చేసుకున్నట్లు నిర్ధారించారు. హవాలా మార్గంలో విదేశాలకు నగదును తరలించారనే ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చింది.
కల్కి దంపతుల కోసం అన్వేషణ
దీనికంతటికీ మూలకారకులైన కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు, ఆయన భార్య అమ్మాజీ భగవాన్ ఏమయ్యారనే విషయం ఇంకా తేలలేదు. వారి కోసం ఐటీ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. లుకౌట్ నోటీసులను జారీ చేశారు. కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ, ఆశ్రమ ఇన్ ఛార్జి లోకేష్ దాసాజీలు ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్నారు. వారి ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. కల్కి దంపతులు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎలా తప్పించుకోగలిగారనేది అంతు చిక్కట్లేదు. కృష్ణాజీ ఇచ్చిన సమాచారం ఇచ్చిన ప్రాంతాల్లో వెదికినప్పటికీ.. వారి జాడ తెలియ రాలేదని తెలుస్తోంది.