ఏసీబీకే షాక్: బంగారం గుట్టలు, నోట్ల కట్టలు: విదేశాల్లో రిటైర్మెంట్ పార్టీ(పిక్చర్స్)
నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఏసీబీ దాడులు జరిగాయి. దీంతో అతడు చేసిన భారీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
Recommended Video
అమరావతి: నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఏసీబీ దాడులు జరిగాయి. దీంతో అతడు చేసిన భారీ అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అంతేగాక, అవినీతి, అక్రమాల ద్వారా సంపాదించిన రూ.500కోట్లకుపైగా ఆస్తులకు ఇద్దరు బినామీలను ఏర్పరచుకున్నాడు.
కాగా, ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారడం గమనార్హం. ఆయనే సోమవారం ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అవినీతి తిమింగలం పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ అండ్ కంట్రీప్లానింగ్) డైరెక్టరు గొల్ల వెంకట రఘు.
500కోట్ల అక్రమాస్తులు..
సోమవారం ఏకకాలంలో జరిపిన దాడుల్లో మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించింది. వారిలో ఒకరేమో పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ అండ్ కంట్రీప్లానింగ్) డైరెక్టరు గొల్ల వెంకట రఘు, మరొకరేమో పురపాలక శాఖ ఇంజినీరింగ్ విభాగం జూనియర్ టెక్నికల్ అధికారి నల్లూరి వెంకట శివప్రసాద్, ఇంకొకరేమో శివప్రసాద్ భార్య చింతమనేని గాయత్రి.
ఒకరికి మరొకరు బినామీగా..
కాగా, గాయత్రి పురపాలక శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా పని చేసి రెండేళ్ల కిందట స్వచ్చంద పదవీ విరమణ చేశారు. వీరు ముగ్గురు(రఘు, శిప్రసాద్, గాయత్రి) చేతులు కలిపారు. ఒకరికి మరొకరు బినామీగా వ్యవహరించి రూ.500 కోట్ల (మార్కెట్ విలువ) అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ గుర్తించింది.
మూడు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఆస్తులు..
మూడు రాష్ట్రాల(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర) పరిధిలోని 8 జిల్లాల్లో తమ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తేల్చింది. వారితో పాటు వారి బంధువులు, కుటుంబసభ్యులు, బినామీల ఇళ్లపై ఏసీబీ డీజీపీ ఆర్పి ఠాకూర్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మొత్తం 23 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఏసీబీ అధికారులకే కళ్లు చెదిరిపోయాయి!
ఈ సందర్భంగా కళ్లు చెదిరే బంగారు, వజ్రాభరణాలు దొరికాయి. ఈదాడుల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్నగరాల్లో ఖరీదైన ఆస్తులు వెలుగుచూశాయి. వీటిలో అత్యధిక శాతం ఆస్తులు నల్లూరి వెంకట శివప్రసాద్ భార్య చింతమనేని గాయత్రి పేరిటే ఉన్నాయి. శివప్రసాద్, గాయత్రిలు గొల్ల వెంకట రఘుకు బినామీలుగా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఆ క్రమంలోనే గన్నవరంలోని భార్గవినగర్లోని శివప్రసాద్ ఇంట్లోని సోదాల్లోనే గుట్టల కొద్దీ బంగారు, వజ్రాభరణాలు, లక్షల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి.
సోదాలు ఎక్కడెక్కడెక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో, మహారాష్ట్రలోని షిర్డీలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. కాగా, గొల్ల వెంకట రఘు పేరిట గుర్తించిన ఆస్తుల పుస్తక విలువ: రూ.4.06 కోట్లుగా ఉంది.
నల్లూరి వెంకట శివప్రసాద్, ఆయన భార్య చింతమనేని గాయత్రి, కుటుంబ సభ్యులు, వారి కంపెనీల పేరిట గుర్తించి ఆస్తుల పుస్తక విలువ: రూ.17.12 కోట్లు. వీరి ఆస్తుల మొత్తం మార్కెట్ విలువ: రూ.500 కోట్లుగా ఉండటం గమనార్హం.
తవ్వే కొద్దీ ఆస్తులు.. లాకర్లింకా తెరవనేలేదు..
కాగా, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు అక్రమ ఆస్తులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. రఘు 2004 నుంచి 2009 వరకూ గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థలో చీఫ్ సిటీ ప్లానర్గా పని చేసిన సమయంలోనే బోలెడన్ని ఆస్తులు కూడబెట్టాడు. ఫిర్యాదుల నేపథ్యంలో అప్పట్లోనే ఏసీబీ దాడి చేయాల్సివున్నా తప్పించుకున్నాడు. నగరంలోని పేరు మోసిన బిల్డర్లంతా రఘు సన్నిహితులే కావడం గమనార్హం. స్థానిక ఎంవిపి సెక్టార్-2లో పబ్లిక్ ప్లేస్లో జరిగిన అక్రమ నిర్మాణంతోపాటు, మరో రెండు అక్రమ కట్టడాలకు రఘు అనుమతి ఇచ్చాడన్న ఆరోపణలున్నాయి. ఇందులో ఒక కేసు నుంచి కొద్ది రోజుల కిందటే రఘు క్లీన్ చిట్ తెచ్చుకున్నాడు. విజయవాడ, విశాఖల్లో సోమవారం జరిగిన ఏసీబీ దాడుల్లో కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణలతోపాటు రూ.లక్షల్లో నగదు పట్టుబడింది. బీచ్ రోడ్డులోని మెజిస్టిక్ టవర్స్లో సుమారు 80.26 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్ను గుర్తించారు. రఘు అక్క పేరున 167 చదరపు గజాల స్థలం ఉన్నట్టు గుర్తించారు. మరో వ్యక్తి, స్థానిక ఆశీల్మెట్ట దగ్గర ఉంటున్న గోవిందరాజు ఇంటిని సోదా చేసేందుకు ఎసిబి అధికారులు వెళ్లగా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అదే ప్రాంతంలో ఉన్న అతని కార్యాలయాన్ని సోదా చేసి హార్డ్ డిస్క్లు, కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంకా రఘుకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరవలేని ఏసీబీ అధికారులు తెలిపారు. అవి కూడా తెరిస్తే మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది.
కోర్టుకు అక్రమార్కులు
అక్రమంగా ఆస్తులు సంపాదించిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు, మున్సిపల్ కార్పొరేషన్ టెక్నికల్ ఆఫీసర్ శివప్రసాద్ ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్నారు. వీరిద్దరిని ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ రూ. 45 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. కానీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
విదేశాల్లో రిటైర్మెంట్ పార్టీ..
ఈ సెప్టెంబర్ నెలాఖరున రిటైర్మెంట్ కానున్న రఘు విదేశాల్లో గుట్టుగా హైక్లాస్ రిటైర్మెంట్ పార్టీ చేసుకునేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. అంతేగాక, ఇందుకోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్లకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు ఇప్పటికే విమనా టికెట్లు కూడా బుక్ చేసినట్లు తెలిసింది. అంతలోనే ఏసీబీ దాడులు జరగడంతో రఘుకు ముచ్చెమటలు పట్టాయి.