విశాఖ ఐడీబీఐలో భారీ స్కాం: రూ. 680కోట్ల గోల్మాల్, టీ, ఏపీల్లో కలిపి రూ.1100కోట్ల స్కాం
విశాఖపట్నం: ఐడీబీఐ బ్యాంకులో మరో భారీ కుంభకోణం బయటపడింది. విశాఖపట్నం ఐడీబీఐ బ్యాంకులో రూ. 680కోట్ల కుంభకోణాన్ని తాజాగా సీబీఐ వెలికితీసింది.
ఐడీబీఐ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.దామోదరన్, అప్పటి డీజీఎం బత్తు రామారావులతో పాటు 24 మంది మధ్యవర్తులు, 26 మంది వేల్యుయేటర్లు కుట్రదారులుగా కేసు నమోదు చేసినట్లు విశాఖ సీబీఐ ఎస్పీ వెల్లడించారు.
కేవలం రూ.25లక్షలు మాత్రమే రుణపరిమితి ఉన్నవారికి రూ.5కోట్ల వరకు ఉద్దేశపూర్వకంగా రుణం మంజూరు చేసినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 18 చోట్ల కీలక డాక్యుమెంట్లను గుర్తించి సీజ్ చేశారు. హైదరాబాద్ ఐడీబీఐలో రూ.480కోట్ల స్కాం జరిగిన విషయం తెలిసిందే.
ఏపీ, తెలంగాణలో కలిసి మొత్తం ఐడీబీఐలో రూ.1100కోట్లు గోల్ మాల్ అయినట్లు సీబీఐ గుర్తించింది. విశాఖపట్నం ఐడీబీఐలో కిసాన్ క్రెడిట్ కార్డుల స్కీం పేరుతో మోసం జరిగినట్లు బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.
మొత్తం 677 మందిని రుణగ్రహీతలుగా చూపారని, రాజమండ్రి, పాలంగి, భీమవరం శాఖల ద్వారా ఈ రుణాలు పంపిణీ అయ్యాయని సీబీఐ తెలిపింది. వారు తనఖా పెట్టిన ఆస్తులను ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ విలువ చూపినట్లు నిర్థరించింది. 545.28కోట్ల రూపాయలు ఈ మూడుశాఖల ద్వరా బట్వాడా అయ్యాయి. రుణాల మంజూరుకు ముందుకానీ, విడుదల తర్వాత కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా తనిఖీలు జరగలేదని సీబీఐ విచారణలో తేలింది.
ఎలాంటి తనిఖీలు లేకుండా రుణాలు మంజూరు చేసి, విడుదల చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తించింది. అవకతవకల కారణంగా మొత్తం బ్యాంకుకు వాటిల్లిన నష్టం రూ.680.21 కోట్లుగా అంచనా వేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది.