ఏపీ రాజధాని, పోలవరానికి నిధులేవీ?: కనీస గౌరవం లేదని సుబ్బిరామిరెడ్డి ఆవేదన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రం తగిన నిధులు కేటాయించకపోవడంపై ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థికంగా సాయం లభించకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని అన్నారు.
కేంద్రం అమరావతి నిర్మాణానికి రూ. 850 కోట్లు కేటాయించిందని, అది ఏ మూలకు సరిపోదని అన్నారు. హైదరాబాద్ను కోల్పోయిన తమను కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునర్ వ్యవస్థీకరణ చట్టంలో రాజధాని అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలని పేర్కొందని తెలిపారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండిఉంటే ఇంతకన్నా ఎక్కువ నిధులు ఇచ్చేదని తెలిపారు. రెండు రాష్ట్రాలకు సాగునీరు, విద్యుత్ అందించే పోలవరం నిర్మాణానికి కూడా కేంద్రం తగినన్ని నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించి భారీ ప్రాజెక్టును నిర్మించుకోవాలంటే ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై ఏపీలోని 6కోట్ల ప్రజలకు కేంద్రమంత్రి ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ తన లోటును భర్తీ చేసుకోవాలంటే కేంద్రం రూ. 25వేల కోట్లమేర ఆర్థిక సాయం అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం రాయలసీమలోని 4 జిల్లాలకు, ఉత్తరకోస్తాలోని 3 జిల్లాలకు ఏడాదికి రూ. 50కోట్లు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ మేర సాయంతో ఇతర రాష్ట్రాలతో ఏపీ ఎలా పోటీ పడగలదని సుబ్బిరామిరెడ్డి ప్రశ్నించారు. అంతేగాక, ఎంపీలాడ్స్ నిధులను రూ. 5 కోట్ల నుంచి 10కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
కనీస గౌరవం ఇవ్వరా?
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రక్షణ కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) గార్డులు ఎంపీలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంటూ రాజ్యసభలో మండిపడ్డారు.
ఈ విషయమై ఆయన రాజ్యసభలో 188 నిబంధన కింద ప్రివిలేజి నోటీసు ఇచ్చారు. ఎంపీల పట్ల ఎస్పీజీ సభ్యులు అమర్యాదగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నప్పుడు వాళ్లు తనపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. వాళ్ల విధులకు తాము ఆటంకం కలిగించబోమని, కానీ కనీసం ఎంపీలమన్న గౌరవం అయినా ఉండాలి కదా! అని సుబ్బిరామిరెడ్డి అన్నారు.
సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన ప్రివిలేజి నోటీసును పరిశీలిస్తామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చెప్పారు. అయితే, ఒక ఎంపీ స్వయంగా తన సొంత అనుభవాన్ని చెబుతున్నప్పుడు కేవలం నోటీసులకు మాత్రమే ఈ అంశం పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు.
కాగా, ఈ నోటీసు పరిధి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు రక్షణ కల్పిస్తున్న ఎస్పీజీకి కూడా విస్తరించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి డిమాండ్ చేశారు. దీంతో కాసేపు సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.