మహిళల ఖాతాల్లో 3500 వేసిన చంద్రబాబు... మహిళా దినోత్సవం కానుకగా పసుపుకుంకుమ
ఏపీలోని మహిళలకు మహిళా దినోత్సవం కానుక ఇచ్చారు చంద్రబాబు. పసుపు కుంకుమ పధకం ద్వారా రెండ విడత నగదును మహిళల అకౌంట్ లలో వేశారు. మహిళలకు ఈ రోజు (మార్చి-7-2019) శుభ దినం అన్న చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాలో జమచేశామన్నారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేశామన్నారు. పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4వేల నగదును మరోసారి అందజేస్తామన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, బూత్ స్థాయి కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.
రేపు మార్చి-8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి ఖాతాల్లోకి నగదు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. రేపు ఏపీ అంతటా డ్వాక్రా మహిళలు సంతోషంతో ర్యాలీలు నిర్వహించబోతున్నారని వెల్లడించారు.మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆడబిడ్డల అండ టీడీపీకి మెండుగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .