జేసీ ట్రావెల్స్ అక్రమాలు : వెలుగులోకి కొత్త కోణం.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు..
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ సంతకాల వ్యవహారం గతంలో వెలుగుచూడగా.. తాజాగా దానికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడ్డాయి. సీఐలు,ఎస్ఐ,ఆర్టీఏ అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లను సృష్టించుకున్న జేసీ సంస్థ.. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను కూడా సృష్టించినట్టు తాజాగా బయటపడింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి వాటిని ఆర్టీఏ అధికారులకు సమర్పించినట్టు రవాణా శాఖ టాస్క్ఫోర్స్ బృందం గుర్తించింది. ఇప్పటివరకు 56 నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను గుర్తించింది.
నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లపై పోలీసులకు ఫిర్యాదు
స్క్రాప్ కింద బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో వాటికి బీఎస్-4 రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే నాగాలాండ్,కర్ణాటక రాష్ట్రాల్లో 154 లారీలను కూడా ఫేక్ డాక్యుమెంట్స్తోనే రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. తాజాగా బయటపడ్డ నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల బాగోతంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోర్జరీ సంతకాల వ్యవహారం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్ అక్రమ వ్యవహారాలపై దృష్టి సారించింది. అనుమతి లేకుండా తిరుగుతున్న బస్సులను సీజ్ చేసింది. ఇందులో ఇంటర్స్టేట్ బస్సులు కూడా ఉన్నాయి. ఇదే క్రమంలో జేసీ ట్రావెల్స్ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఆర్టీఏ అధికారులు ఫోర్జరీ సంతకాల బాగోతాన్ని బయటకు తెచ్చారు. పోలీసులు,అధికారుల ఫోర్జరీ సంతకాలతో క్లియరెన్స్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి జేసీ కార్యాలయంలో నకిలీ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నాగేంద్ర,రఘు అనే ఇద్దరు ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు.
జేసీకి దెబ్బ మీద దెబ్బ
ఇటు బస్సుల వ్యవహారంలో అక్రమాలు బయటపడుతున్న సమయంలో జేసీకి ప్రభుత్వం మరో గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల గడువు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. అక్కడ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడనందునే ఐదేళ్ల గడువును రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.అంతేకాదు,లీజు ప్రాంతం నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలను అక్రమంగా తవ్వితీసి.. రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిమెంట్ ప్లాంట్ నిర్మాణం పేరుతో మైనింగ్ లైసెన్సులు పొంది, ఖనిజాన్ని వేరేవాళ్లకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు జేసీపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానిపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది.
ఇటీవల భద్రత కూడా తొలగింపు..
అటు జేసీ భద్రతను కూడా జగన్ సర్కార్ తొలగించిన సంగతి తెలిసిందే. గతంలో ఆయనకున్న భద్రతను 2+2 నుంచి 1+1రకి తగ్గించిన ప్రభుత్వం.. ఇటీవల పూర్తి భద్రతను ఎత్తివేసింది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల అనుసారం జేసీకి భద్రతను తొలగిస్తున్నట్టు అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని జేసీ వర్గీయులు,టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది.