మాజీ ఎంపీ జేసీకి షాక్ ఇచ్చిన ఆర్టీఏ ... జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. జెసి దివాకర్ రెడ్డి కి సంబంధించి జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. మొత్తం జేసీ ట్రావెల్స్ నుండి నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులను సీజ్ చేశారు ఆర్టీఏ అధికారులు. అంతేకాదు జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.
జేసీ ట్రావెల్స్ అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేపట్టామని వివరించిన కమిషనర్ సీతారామాంజనేయులు జేసీ ట్రావెల్స్ నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతోందని పేర్కొన్నారు. కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు చేసిన అధికారులు జేసీ ట్రావెల్స్ పై కొరడా ఝుళిపించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం,ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం జేసీ ట్రావెల్స్ చేస్తుందని,అంతేకాక ట్రావెల్స్ కు సంబంధించిన పత్రాలు లేవని,ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
దాంతో 23 బస్సులను సీజ్ చేసినట్టు బుధవారం రాత్రి ప్రకటించారు.అంతేకాదు నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు సైతం నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఏ ట్రావెల్స్ పైన అయినాసరే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. జేసీ ట్రావెల్స్ పైన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇంకా విచారణ కొనసాగుతుందని కమిషనర్ సీతారామాంజనేయులు పేర్కొన్నారు. మరి ఈ తనిఖీలపై,బస్సులు సీజ్ చేయటంపై జేసీ దివాకర్ రెడ్డి ఏమంటారో తెలియాల్సి వుంది.