షోరూమ్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...తప్పిన పెను ముప్పు...బ్రేకులు పనిచేయక...
పశ్చిమగోదావరి జిల్లా: చింతలపూడిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళుతున్న ఈ పల్లెవెలుగు బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బజాజ్ షోరూమ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం...ఏలూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు చింతలపూడి మీదుగా అశ్వారావుపేట వెళుతోంది.
బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బజాజ్ షోరూమ్లోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగనప్పటికి షోరూమ్ లో పనిచేస్తున్న కొక్కిరగడ్డ రాజశేఖర్, మెకానిక్ తేజ, వేమారెడ్డిలకు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బజాజ్ షో రూమ్లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.