RTC : రేపటి నంచి తెలంగాణ-ఏపీ మధ్య ఆర్టీసీ సర్వీసులు షురూ...
తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సోమవారం(జూన్ 21) నుంచి ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాలకు తెలంగాణ నుంచి ఆర్టీసీ రాకపోకలు సాగనున్నాయి. ఏపీలో కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపనున్నారు.కర్ణాటకకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడపనున్నారు.
ఏపీలో సాయంత్రం 6గంటల తర్వాత కర్ఫ్యూ ఉండటంతో.. అంతకుముందే బస్సులు అక్కడికి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. కర్ణాటకలో వీకెండ్ లాక్డౌన్ అమలులో ఉండటంతో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ నుంచి అక్కడికి ఆర్టీసీ రాకపోకలు ఉండవు.
మరోవైపు,ఏపీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణకు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణకు బస్సులు నడిపేలా షెడ్యూల్ రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణకు బస్సులు నడపనుంది. ముందస్తు రిజర్వేషన్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాగా, తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం(జూన్ 19) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు లాక్డౌన్ ఎత్తేశారు.లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.
నిజానికి రాత్రిపూట కర్ఫ్యూని కొనసాగించవచ్చునని చాలామంది భావించినప్పటికీ.. ప్రభుత్వం అన్ని నిబంధనలను ఎత్తివేసింది. ఆదివారం(జూన్ 20) నుంచి అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. మాస్కు ధరించకపోతే రూ.1వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భౌతికదూరం,శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించాలి. జులై 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్లు తెరుచుకుంటాయి.