తిరుమల ఘాట్ రోడ్డులో పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు
తిరుపతి: తిరుమల కొండల్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న నిర్మించిన గోడను ఢీ కొని లోయ అంచుల్లోకి జారిపోయింది. ఈ ఘటనలో సుమారు మంది భక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి సుమారు 20 మంది భక్తులతో ఆర్టీసీ బస్సు మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరింది. అలిపిరి వద్ద టోల్గేట్ను దాటుకున్న కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.
ఆ సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవసాగింది. తిరుమలకు వెళ్లే మార్గంలో రెండో ఘాట్ రోడ్డులో వినాయకుని గుడి వద్ద మలుపులో బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన నిర్మించిన డివైడర్ను ఢీ కొట్టి.. లోయలోకి ఒరిగిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన వెంటనే డ్రైవర్.. లోయకు ఆనుకుని ఉన్న చెట్టుకు బస్సును ఢీ కొట్టాడు. దీనితో బస్సు చెట్టును గుద్దుకుని అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో గాయపడ్డ 10 మంది భక్తులను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు.