APSRTC: రోడ్డెక్కిన బస్సులు.. అనేక నిబంధనలు: సిటీ బస్సులపై కీలక నిర్ణయం: సందడిగా బస్టాండ్లు
అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 59 రోజుల తరువాత తొలిసారిగా పాక్షికంగా ఆర్టీసీ రోడ్ల మీదికి వచ్చాయి. పాక్షికంగానే అయినప్పటికీ.. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. ఈ ఉదయం 7 గంటలకు బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. 12 గంటలు మాత్రమే బస్సులను నడిపిస్తామని ప్రజా రవాణా సంస్థ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో సాయంత్రం 7 గంటలకల్లా అవన్నీ డిపోలకు చేరుకుంటాయి. తొలిదశలో 1638 బస్సులను అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు.
రైలు టికెట్ల జారీలో సడన్ ట్విస్ట్: వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఏం చేయాలి? తత్కాల్ టికెట్లపై
బస్సుల్లో మార్పులు..
ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రయాణికుల మధ్య భౌతికదూరాన్ని తప్పని చేశారు. దీనికోసం బస్సు సీటింగ్లో మార్పులు చేశారు. సూపర్ డీలక్స్ బస్సుల్లో గ్యాంగ్ వేలో కొత్తగా సీట్లను అమర్చారు. ఒక్కో సీటు మధ్య రెండు అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలను తీసుకున్నారు. అన్ని రకాల బస్సుల్లో సీట్ల సామర్థ్యాన్ని తగ్గించారు. భౌతిక దూరానికి అనుగుణంగా పల్లె వెలుగు-35, ఎక్స్ప్రెస్-20, అల్ట్రా డీలక్స్-29, సూపర్ డీలక్స్-26 సీట్లు మాత్రమే ఉన్నాయి. సిటీబస్సులను నడిపించట్లేదు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నగదు రహితంగా టికెట్ల జారీ.. నాన్స్టాప్ ప్రయాణం..
ప్రయాణికులకు బస్సు ఎక్కడానికి ముందే టికెట్లను ఇచ్చారు. టిమ్స్ ఆధారంగా బస్ స్టేషన్లలోనే టికెట్లను జారీ చేశారు. దీనికోసం బస్స్టేషన్లలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. బస్సులో కండక్టర్ ఉండడు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా మార్గాల్లో బస్సులను నాన్స్టాప్గా నడిపిస్తున్నారు. డెస్టినేషన్ టు డెస్టినేషన్ ప్రాతిపదికన వాటిని నడిపిస్తున్నారు. మార్గమధ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవట్లేదు.
మాస్కులు ఉంటేనే..
మాస్కులు ధరించిన ప్రయాణికులకు మాత్రమే బస్సును ఎక్కడానికి అనుమతి ఇచ్చారు అధికారులు. బస్సు ఎక్కడానికి ముందు శానిటైజర్లతో ప్రయాణికులు తమ చేతులను శుభ్రం చేసుకోవాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రతి డ్రైవర్కూ శానిటైజర్ బాటిల్ను అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి రాయితీలను అమలు చేయట్లేదు. స్టూడెంట్ పాసులు, జర్నలిస్ట్ పాసులు సహా ఎలాంటి రాయితీ కార్డులకు అనుమతి ఇవ్వట్లేదు.
అంతర్రాష్ట్ర సర్వీసులకు మరింత సమయం..
అంతర్రాష్ట్ర బస్ సర్వీసులను నడిపించడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించిన తరువాతే.. వాటిని నడిపిస్తారు. ఈ దిశగా అధికారులు చర్చలను నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాలకు కేవలం నైట్ సర్వీసులు నడపుతామని, పరిస్థితులు కుదుటపడిన తరువాతే డే సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. బస్సెక్కాలంటే మాస్కులు తప్పనిసరి చేశామని, శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Recommended Video
సందడిగా పీఎన్బీఎస్
తాజాగా బస్సుల రాకపోకలు ఆరంభమైన నేపథ్యంలో.. బస్ స్టేషన్లు సందడిగా మారాయి. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్) వచ్చీ, పోయే ప్రయాణికులతో కోలాహలం నెలకొంది. ప్రతి బస్స్టేషన్లోనూ సంబంధిత అధికారులు మైకుల ద్వారా అనౌన్మెంట్ల చేస్తూ కనిపించారు. ప్రయాణికులకు జాగ్రత్తలను చెబుతూ.. ఏ బస్సు ఎన్ని గంటలకు ఎక్కడికి వెళ్తుందో వివరిస్తూ.. మార్గమధ్యలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరిస్తూ గడిపారు. బస్ స్టేషన్లలో సామాజిక దూరాన్ని పాటించేలా బాక్సులను వేశారు.