ఏపీలో ఆర్టీసీ చార్జీల మోత, విలీన భారం, డీజిల్ ధర పెంపుతో నిర్ణయం...
ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ విలీనం, డీజిల్ ధర పెంపుతో చార్జీలు పెంచాల్సి వస్తోందని పేర్కొన్నది. ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తికాకపోవడం, కేంద్ర ప్రభుత్వం 31 శాతానికి సంబంధించి నిధులు రాకపోవడంతో ఆర్టీసీకి నెలకు రూ.100 కోట్ల నష్టంలో నడుస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆర్టీసీకి జీవం పోసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు.
ఉద్యోగులు-ప్రజలు
ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేస్తూనే.. ప్రజల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఉద్యోగుల విలీనంతో సాంకేతికపరమైన సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందేనని చెప్పారు. పల్లె వెలుగు, సిటీ బస్సులకు సంబంధించి కిలోమీటర్కు రూ.పది పైసలు పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. మిగతా సర్వీసులకు రూ.20 పైసలు పెంచుతామని వెల్లడించారు.
నెలకు రూ.100 కోట్ల నష్టం
ఆర్టీసీకి నెలకు రూ.100 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఏడాదికి రూ.1200 కోట్ల నష్టంతో సంస్థ నడుస్తుందని చెప్పారు. ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తవలేదని.. తెలంగాణతో ఆస్తులు పంపకాల ప్రక్రియ మిగిలే ఉందని చెప్పారు. షిలాబిడే కమిటీ ప్రతిపాదనలు అమలుకాలేదని గుర్తుచేశారు. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్రం.. అప్పులపై మాత్రం మాట్లాడటం లేదన్నారు.
23 శాతం అద్దె బస్సులు
ఆర్టీసీలో 23 శాతం అద్దె బస్సులు తిరుగుతున్నాయని మంత్రి చెప్పారు. వాస్తవానికి బోర్డు 35 శాతం బస్సులు తిప్పేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెడతామని చెప్పారు. ఏప్రిల్లో వెయ్యి బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. వెయ్యిలో మార్చి వరకు 240 బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
12 లక్షలు కి.మీ తిరిగితే
ఫిట్ నెస్ ఉన్న బస్సులనే రూట్లలో తిప్పుతామని మంత్రి పేర్ని నాని తెలిపారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను తీసుకొస్తామని చెప్పారు. ఆర్టీసీ సంస్థ నిర్ణయం మేరకు కొత్త బస్సులను తీసుకుంటున్నామని చెప్పారు. తమకు ప్రయాణికుల భద్రతే ముఖ్యమని నొక్కివక్కానించారు.