ఆగస్ట్ 2 నుంచి రెండు రాష్ట్రాల్లో ఆర్టీసి సమ్మె: ఈయు
హైదరాబాద్: ఆగస్టు 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసి కార్మికులు సమ్మె చేయనున్నట్లు ఈయు నాయకులు ప్రకటించారు. గురువారం బస్ భవన్లో ఆర్టీసి యాజమాన్యం కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
సొసైటీ బకాయిలు చెల్లించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఆర్టీసి యాజమాన్యం సొసైటీకి రూ. 250 కోట్లు బకాయి పడింది. సొసైటీ డబ్బును వాడుకోవడంపై కార్మికులు అధికారులను నిలదీశారు. చర్చల జరుగుతున్న సమయంలోనే ఆర్టీసి ఈయు నేతలు బయటకు వచ్చేశారు. ఆగస్టు 2 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు.
సొసైటీ బకాయిలు చెల్లించలేమని యాజమాన్యం తేల్చి చెప్పడంతో తాము సమ్మె చేసేందుకు నిర్ణయించినట్లు ఈయు నాయకులు తెలిపారు.
అంతకుముందు ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులను కలిసినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నిరసనలకు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగివచ్చిన ఆర్టీసీ యాజమాన్యం కార్మక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆగస్టు 2 నుంచి సమ్మెకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.