ప్రయాణికులకు ఆర్టీసీ బాదుడు...రూ.4 వరకు ఛార్జీల పెంపు
విజయవాడ:అనుకున్నంతా అయింది...ఆర్టీసి నుంచి ప్రయాణికులపై ఛార్జీల పెంపు బండ పడనే పడింది. డీజిల్ ధరల పెంపు వల్ల ఆర్టీసికి భారం పడుతున్నా బస్ ఛార్జీలను పెంచబోమని యాజమాన్యం ప్రకటించి కొన్నిరోజులు కూడా గడవక ముందే ఛార్జీల పెంపు నిర్ణయం వెలువడటం గమనార్హం.
ఎపిఎస్ ఆర్టీసి బస్ ఛార్జీలను పెంచుతూ ఆ సంస్థ ఎండి ఎన్వి సురేంద్రబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగువెలుగు మినహా అన్ని జిల్లా సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలను తరువాతి రౌండ్ ఫిగర్ స్థానానికి పెంచుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిల్లర సమస్య కారణంగానే ఇలా ఛార్జీలు పెంచాల్సి వస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొనడం విశేషం.
ఛార్జీల పెంపు...బండ పడింది
ఆర్టీసీ ప్రయాణికులకు జారీ చేసే టికెట్ పై గరిష్టంగా నాలుగు రూపాయల వరకు ఛార్జీ పెంచుతున్నట్లు ఎపిఎస్ఆర్టీసీ ఎండి ఎన్వి సురేంద్రబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సవరించిన ఛార్జీలు 21వ తేదీ అర్ధరాత్రి నుంచే అమల్లోకొచ్చాయి. చిల్లర సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఆన్లైన్ బుకింగ్ లకు మాత్రం పాత ఛార్జీలే వర్తించనున్నట్లు వివరించారు.
ఛార్జీల పెంపు...ఇలా...
ఈ ఛార్జీల పెంపు ఎలా ఉంటుందంటే?...ఇప్పుడు ఒక ఊరు నుంచి మరో ఊరుకు రూ.11, రూ.21, రూ.31 ఛార్జీలు ఉన్నట్లయితే ఆ టికెట్ల ధర ఆ తరువాత స్థానం రౌండ్ ఫిగర్ అంటే వరుసగా రూ.15, రూ.25, రూ.35కు పెరుగుతాయి. అదే టికెట్ ధర రూ.16, రూ.26, రూ.36 ఉన్నట్లయితే వాటి ఛార్జీలు రూ.20, రూ.30, రూ.40కు పెరగుతాయి. అలాగే వెన్నెల సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలను తరువాత ఛార్జీ రూ.10కి రౌండప్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
భారం...విమర్శలు
ఈ విధంగా ఛార్జీల పెంపు వల్ల రోజుకు సుమారు రూ.1.5 కోట్ల భారం ప్రయాణికులపై పడనున్నట్లు ఆర్థిక నిపుణుల అంచనా. డీజిల్ ధరల పెంపు వల్ల ఆర్టీసిపై అదనపు భారం పడుతున్నా బస్ ఛార్జీలని పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెట్టబోమని ప్రకటించిన యాజమాన్యం కొన్ని రోజులకే తమ ప్రకటనకు తిలోదకాలు ఇస్తూ చిల్లర సమస్య పేరుతో ఛార్జీలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా...ప్రచారం చేయకుండా
అయితే ఆర్టీసీ ఛార్జీల పెంపు గురించి గతంలోలాగా ప్రయాణికుల్లో ముందస్తుగా ప్రచారం కల్పించకుండా ఒక్కసారిగా పెంచిన బస్ ఛార్జీలను అమలు చేయడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఇలా హఠాత్తుగా టికెట్ల ధర పెంచడం వల్ల ప్రయాణికులు, కండక్టర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఛార్జీల్లో సవరణలు చేసినప్పుడు బస్సులపై పోస్టర్లు అంటించి ప్రచారం నిర్వహించిన విషయాన్ని అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు ఇలా హఠాత్తుగా, భారీగా ఛార్జీలను పెంచడం వల్ల ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియోపై పెను ప్రభావాన్ని చూపుతుందని ఆర్టీసీ యూనియున్ నేతలు విశ్లేషిస్తున్నారు.