ఆర్టీసీ బస్సుల్లో పండుగ బాదుడు: 50 శాతం అదనపు ఛార్జీలు: సిటీ బస్సులే ప్రత్యేక సర్వీసులుగా..!
సంక్రాంతి పండగును క్యాష్ చేసేకొనేందుకు ఆర్టీసీ కార్యాచరణ సిద్దం చేసింది. ప్రజల పైన పండుగ పేరుతో అదనపు ఛార్జీల భారం మోపేందుకు సిద్దమైంది. స్పెషల్ సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు ఛార్జీల వసూలుకు నిర్ణయించింది. సంక్రాంతి రద్దీ కారణంగా ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరపై 50% అదనపు మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్రతీ ఏటా ఇదే విధంగా పండుగ సమయాల్లో అధిక రాబడి తెచ్చుకొనే క్రమంలో ఈ నిర్ణయం సాధారణంగా మారిపోయింది. కొద్ది రోజుల క్రితమే రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. కానీ, ఇప్పడు తిరిగి సంక్రాంతి సమయంలో రైళ్లలో ఉండే రద్దీ కారణంగా..బస్సులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో..స్పెషల్ సర్వీసుల పేరతో స్పెషల్ దోపిడీకి అధికారిక నిర్ణయం జరిగిపోయింది.
పండుగ ప్రత్యేక బాదుడు..50 శాతం అదనం..
తెలంగాణ ఆర్టీసీ పండగ బాదుడుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరపై 50% అదనపు మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దూర ప్రాంతాలకు తిరిగే అన్ని ప్రత్యేక బస్సుల్లో ఈ అదనపు రేట్లు అమల్లో ఉంటాయి. రాష్ట్రం పరిధిలో..తక్కువ దూరంలోని ప్రాంతాల మధ్య తిరిగే ప్రత్యేక బస్సుల విషయంలో మాత్రం స్థానిక అధికారులు అప్పటి కప్పుడు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు.
వీటిల్లో కూడా చాలా ప్రాంతాల్లో 50 శాతం అదనపు మొత్తం వసూలుకే స్థానిక అధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఛార్జీల పెంపు పైన ప్రయాణీకుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ, ఆర్టీసీకి అదనపు సొమ్ము రాబట్టాలంటే ఇదే సరైన సమయంగా అధికారులు భావిస్తున్నారు.
తప్పకుంటే ఇలా చేద్దాం..
గతంలో అనేక సందర్బాల్లో ఈ ప్రతిపాదన పైన ప్రయాణీకుల నుండి వ్యతిరేకత కనిపించినా..నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. కానీ, అధికారులు ఈ సారి కొత్త ప్రతిపాదన తెర మీదకు తెస్తున్నారు. ప్రత్యేక బస్సుల పైన 50 శాతం అదనపు ఛార్జీ కాకుండా.. ధారణ టికెట్ ధర కంటే కొంత మొత్తం పెంచి దాన్ని సమీప పెద్ద సంఖ్యకు రౌండాఫ్ చేసి వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 4,779 అదనపు సర్వీసులు తిప్పాలని అధికారులు ప్రణా ళిక సిద్ధం చేశారు. 10వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక బస్సులు అని
ఆర్టీసీ ప్రయాణీకుల రద్దీకి ప్రత్యేక బస్సులు అని ఘనంగా చెబుతున్నా..గతంలో అనేక సందర్భాల్లో హైదరాబాద్ సిటీలో సంక్రాంతి సమయంలో రద్దీ ఉండని కారణంగా..అక్కడి సిటీ సర్వీసులనే ఏపీలోని అనేక ప్రాంతాలను తిప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా..వాటికి అదనపు బస్సుల పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడు..సైతం అదే మార్గంలో ఆర్టీసీ ప్రయాణం కనిపిస్తోంది.