ఆర్టీసి సమ్మె విరమణ: రోడ్డు మీదికి వచ్చిన బస్సులు
హైదరాబాద్: గత బుధవారం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మెకు తెరపడింది. 43 శాతం ఫిట్మెంట్ కోరుతూ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేయడంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు చిక్కుల పాలయ్యారు.
బుధవారం ఉదయం హైకోర్టు కార్మిక సంఘాలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికసంఘ ప్రతినిధులతో చర్చించారు. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపిన కార్మిక సంఘాలు సమ్మె విరమణకు అంగీకరించాయి.
కొత్త ఫిట్మెంట్ జూన్ నుంచి
తెలంగాణ ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి అంగీకరించింది. కార్మికులు కోరిన దానికన్నా తెలంగాణ ఒక శాతం అదనంగా ఫిట్మెంట్ ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ఫిట్మెంట్ జూన్ నుంచి అమల్లోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసినట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కార్మిక సంఘాలతో చర్చల అనంతరం ఏపీ మంత్రులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్మికులతో చర్చలు సఫలమయ్యాయని ప్రకటించారు. ప్రస్తుతానికి ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచనేదీ లేదన్నారు.
తెలంగాణలో చార్జీల మోత
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ను ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు బయలుదేరుతున్నాయి. నగరంలో అందుబాటులో ఉన్న సిబ్బందితో అధికారులు సిటీ బస్సులను నడిపిస్తున్నారు. స్వల్పంగా చార్జీలు పెంచనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ వైపు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా నగరం నుంచి బెంగళూరు, విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖ, కర్నూల్, అనంతపురం, కడప, గుంటూరు, ఒంగోలుకు బస్సులు బయలుదేరుతున్నాయి.
ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం నుంచి తమ బాధ్యత పెరిగిందన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ తాము కోరిన దానికంటే ఒక శాతం ఫిట్మెంట్ ఎక్కువగా పెంచడం సంతోషంగా ఉందన్నారు.
కష్టపడి పని చేసి ఆర్టీసీని కాపాడుకుంటామని, చరిత్రలో ఎప్పుడు ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. నేటి నుంచి సమ్మె విరమిస్తున్నామని, ఇక కార్మికులందరూ విధుల్లోకి హాజరవుతారని చెప్పారు.
కార్మికుంలదరూ కష్టపడి పని చేయాలి. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రూ. 3 వేల నుంచి రూ. 22 వేల వరకు జీతాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ ఎంసెట్కు ప్రత్యేక బస్సులు
తెలంగాణ వ్యాప్తంగా రేపు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే హైదరాబాద్లో ఎంసెట్ రాసే విద్యార్థులకు ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. బస్సుల వివరాల కోసం కోఠి టెర్మినల్లో టోల్ ఫ్రీ నంబర్.. 9959226160.