హైకోర్టు తీర్పు అందలేదు, సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసి సంఘాలు
హైదరాబాద్: వెంటనే విరమించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించాయి. చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లామని, కోర్టు తీర్పు కాపీ తమకు అందలేదని, అప్పటి వరకూ సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఈయూ, టీఎంయూ నేతలు స్పష్టం చేశారు.
తీర్పు ప్రతి అందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఈయూ నేత పద్మాకర్ తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పుతో షాక్కు గురయ్యామని, సమ్మె విషయంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు. హైకోర్టు నిర్ణయంపై అప్పీలుకు వెళ్లడం లేదా విధుల్లో చేరడంపై ఆలోచిస్తామని చెప్పారు.
న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నామని పిటీషనర్ సీఎల్ వెంకట్రావు తెలిపారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ ఎంసీఐ మాజీ సభ్యుడు సీఎల్ వెంకట్రావు, చిత్తూరు వాసి మహ్మద్ గౌస్ వేసిన హౌస్మోషన్ పిటీషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని, కార్మికులు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.