మొన్న రూల్ 71, నిన్న రూల్ 154: నిబంధనలే అస్త్రాలుగా.. వైసీపీని దెబ్బకొట్టిన టీడీపీ.. !
అమరావతి: రూల్ 71..రూల్ 154. బహుశా ఈ రెండింటినీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మరిచిపోలేకపోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడానికి ప్రధాన కారణమైన నిబంధనలు ఇవి. తెలుగుదేశం పార్టీ ఈ రెండు నిబంధనలను సకాలంలో తెర మీదికి తీసుకుని వచ్చింది. అంతే సమర్థవంతంగా ప్రయోగించగలిగింది. ఫలితం- మనకు తెలిసిందే.
చరిత్రలో డార్క్ డే: టీడీపీపై నిప్పులు: లేఖ చెల్లదని ప్రకటించి.. తనంతట తాను ఎలా?
రూల్ 71ను ప్రస్తావన వచ్చినప్పుడే..
రూల్ 71 అంశాన్ని మండలి సమావేశాల్లో ప్రస్తావించినప్పుడే తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో స్పష్టమైంది. ఇక ఏపీ వికేంద్రీకరణ బిల్లు శాసన మండలి గడప దాటకపోవచ్చనే అభిప్రాయాలు అప్పుడే వెలువడ్డాయి. రూల్ 71 ప్రభావం ఎలా ఉంటుందనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తెలియనిది కాదు. అందుకే ఈ రూల్ను టీడీపీ సభ్యులు మండలిలో ప్రతిపాదించిన సమయంలో వారు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. మంత్రులు కూడా ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లడం..వైఎస్ఆర్సీపీ సభ్యుల్లో నెలకొన్న అసహనానికి అద్దం పట్టింది.
రూల్ 154..
శాసన మండలి రూల్బుక్లో పెద్దగా ఎవరూ దృష్టి సారించని నిబంధన 154. దీన్ని ఎప్పుడో గానీ ప్రయోగించరనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి నిబంధనే ఇప్పుడు ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు మోకాలడ్డటంలో కీలక పాత్ర పోషించింది. ఛైర్మన్ స్థానానికి కొన్ని విచక్షణాధికారాలను సంక్రమింపజేసే నిబంధన ఇది. దీన్ని ఎవరూ ప్రశ్నించ లేరు. అలాంటి 154 నిబంధననే తాజాగా శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ వినియోగించుకోగలిగారు.
రూల్ 154 ప్రకారం..
రూల్ 154 ప్రకారం.. తనకు సంక్రమించిన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు మహ్మద్ షరీఫ్. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన లేఖ.. నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితి లేకపోయినా.. ఛైర్మన్గా, 154 నిబంధన ప్రకారం తనకు సంక్రమించిన విచక్షణాధికారాలను వినియోగించుకుని ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.
చుట్టుముట్టుతున్న వివాదాలు..
రూల్ 154ను వినియోగించుకోవడం పట్ల శాసన మండలి ఛైర్మన్ స్థానంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ వంటి కొందరు రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు. విచక్షణాధికారాలను ఎలా వినియోగించుకోగలుగుతారనే ప్రశ్న ఉత్పన్నతమౌతోందని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, శాసన మండలి అధికారులు స్పష్టం చేసిన విషయాన్ని ఛైర్మన్ సైతం అంగీకరించి మరీ.. 154ను వినియోగించుకోవడం సరైనది కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.