సిఎం పుకార్లు: గవర్నర్తో కన్నా భేటీ, కలకలం
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కలుసుకున్నారు. శనివారంనాటి ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ స్థితిలో గవర్నర్తో ఆయన భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు చెబుతున్నారు.
గవర్నర్తో కన్నా లక్ష్మీనారాయణ భేటీపై కాంగ్రెసు పార్టీలో విస్తృతమైన చర్చకు దారి తీసింది. కాంగ్రెసు ఓ విధమైన కలకలం కూడా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలోనే కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్తో కలిశారని అంటున్నారు. అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని కన్నా లక్ష్మినారాయణ వర్గీయులు అంటున్నారు. చాలా రోజుల క్రితం కన్నా అపాయింట్మెంట్ అడిగారని, ఆ అపాయింట్మెంట్ ఇప్పుడు లభించిందని వారు చెబుతున్నారు.
కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని పరిణామాలపై గవర్నర్ నరసింహన్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కన్నా లక్ష్మినారాయణ భేటీకి ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.
కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియా ప్రతినిధుల వద్ద తనపై వస్తున్న పుకార్లపై కాస్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో లేనని ఆయన మరోసారి చెప్పారు. అంతకు ముందు కన్నా లక్ష్మీనారాయణ తెలంగాణకు చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్తో సమావేశమయ్యారు. కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజన విషయంలోనూ, విభజన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తోందని, ఇందులో భాగంగానే ఈ భేటీలు జరుగుతున్నాయని అంటున్నారు.