తెలుగు రాష్ట్రాల ఛీఫ్ జస్టిస్ల బదిలీ ? జోరుగా ప్రచారం - సీపీఐ నారాయణ లీకులతో..
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. త్వరలో సుప్రీంకోర్టు కొలీజియం తెలుగు రాష్ట్రాలతో పాటు పలు హైకోర్టుల ఛీఫ్ జస్టిస్లను బదిలీ చేయబోతోందని దాని సారాంశం. సీపీఐ జాతీయ నేత నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్లలోనూ ఇదే ప్రచారం సాగుతోంది. సుప్రీం కొలీజియం కనీసం ఐదు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయనున్నట్లు జరుగుతున్న ఈ ప్రచారంతో సుప్రీం ఛీఫ్ జస్టిస్కు సీఎం జగన్ రాసిన లేఖపై కదలిక వచ్చిందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.
జగన్ లేఖపై సుప్రీం స్పందిస్తుందా?
ఏపీలో గతేడాది ఎన్నికైన తమ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి అస్ధిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సీఎం జగన్ ఈ ఏడాది ఛీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. ఈ లేఖపై ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. అయితే తెరవెనుక దీనిపై సుప్రీంకోర్టు కొలీజియం స్పందిస్తోందా ? జగన్ లేఖలో పేర్కొన్న అంశాల ఆధారంగా తదుపరి చర్యలకు సిద్దమవుతోందా ? ఈ మేరకు త్వరలో ఓ ప్రకటన వెలువడనుందా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా తాజాగా సీపీఐ జాతీయ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేలాఉన్నాయి.
సీపీఐ నారాయణ లీకులతో..
ఏపీలో వైసీపీ సర్కారుకూ, హైకోర్టుకూ మధ్య సాగుతున్న యుద్ధంలో భాగంగా సీఎం జగన్ ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ను బదిలీ చేయించేందుకు ఢిల్లీలో గట్టిగా ప్రయత్నిస్తున్నారని సీపీఐ నేత నారాయణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఇందుకోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఈ మేరకు భారీ లాబీయింగ్ చేస్తున్నారని బాంబు పేల్చారు. కేంద్రానికి బేషరతుగా జగన్ మద్దతిస్తున్నందువల్లే కేంద్రం కూడా ఈ విషయంలో జగన్ చెప్పినట్లు ఆడుతోందని నారాయణ ఆరోపణలు చేశారు. అంటే దాదాపుగా ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ తొలగింపు ఖాయమనే అర్ధం వచ్చేలా నారాయణ వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఢిల్లీ టూర్తో అనుమానాలు
సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆహ్వానం మేరకు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్షాతో భేటీలో జగన్ ఏం చర్చించబోతున్నారనే చర్చ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. పైకి చెప్పడానికి రైతుల నిరసనల విషయంలో జగన్ మద్దతు కోరేందుకే అమిత్షా పిలిపించి ఉంటారని ప్రచారం జరుగుతున్నా, అంతకు మించిన విషయాలే చర్చకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సుప్రీం ఛీఫ్ జస్టిస్కు తాను రాసిన లేఖకు స్పందనగా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీతో పాటు ఇతర అంశాలకూ జగన్ పట్టుపట్టవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే సీపీఐ నారాయణ చెబుతున్నట్లుగా ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ తొలగింపు ఉండొచ్చనేది ఈ రూమర్ల సారాంశం. కానీ కేంద్రం స్పందించి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ను కానీ న్యాయమూర్తులను కానీ తొలగించే అవకాశం లేదు. తిరిగి సుప్రీం కొలీజియం, ఛీఫ్ జస్టిస్ ప్రమేయం లేకుండా ఇదంతా జరగదు. కాబట్టి ఆ దిశగా లాబీయింగ్ జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
హైకోర్టు సీజేల బదిలీ ప్రచారం
జగన్ సుప్రీం ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖ, తదనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారి వాదన ప్రకారం త్వరలో ఏపీ హైకోర్టుతో పాటు మరో నాలుగు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీం కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఢిల్లీ సర్కిళ్లలో సాగుతోంది. కాబట్టి పనిలో పనిగా ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్తో పాటు ఇతర సీజేలను కూడా బదిలీ చేస్తున్నారా అన్నది స్పష్టం కాలేదు. ఒకవేళ సుప్రీం కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం సీఎం జగన్తో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా భారీ ఊరటగా చెప్పవచ్చు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.