గుంటూరు జిల్లా వైసిపిలో కలకలం:చిలకలూరిపేట టికెట్ పై రగడ...ఉత్కంఠ
గుంటూరు:గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు అంశం జిల్లా వైసిపిలో కలకలం రేపింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ను ఇటీవలే వైసిపిలో చేరిన ఒక మహిళా ఎన్నారైకు ఇవ్వబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం ఆ నియోజకవర్గం వైకాపాలో పెను ప్రకంపనలే రేపుతోంది.
దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తూ ఇటీవలికాలం వరకూ వైకాపాకు జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తాజా పరిణామాలతో ఏకంగా పార్టీ మారేందుకు, టిడిపిలో చేరేందుకు సంసిద్దులయ్యారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. దీంతో . ఎన్నికల సమరానికి ఇంకా గడువు ఉండగానే అప్పుడే టికెట్ల రగడ ప్రారంభానికి ఈ వివాదం తెరతీసినట్లయింది.
ప్రచారం...భగ్గుమన్న అసంతృప్తి
ఇటీవలే చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడదల రజనీ కుమారి అనే మహిళా ఎన్నారై ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను కలసి ఆయన సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననే హామీ తీసుకొనే వైసిపిలో చేరారని, అందుకోసం జగన్ కు భారీగా పార్టీ ఫండ్ కూడా ఇస్తానని మాట ఇచ్చారని, త్వరలోనే ఆమెను చిలకలూరిపేట వైసిపి ఇనఛార్జ్ గా నియమించనున్నారనే ప్రచారం స్థానికంగా ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ ప్రచారంతో చిలకలూరిపేట వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అనుచరులు,మద్దతుదారులు భగ్గుమన్నారు.
మర్రి రాజశేఖర్...నేపథ్యం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ప్రస్తుత మంత్రిగా ఉన్న టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో పరాజయం పాలయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి మర్రి రాజశేఖర్ కుటుంబానికి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పిల్లనిచ్చిన మామ మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాజశేఖర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యం కారణంగానే గత ఎన్నికల్లో ఆయన పుల్లారావు మీద ఓటమిపాలైనా ఇటీవలికాలం వరకు వైసిపి ఆయన్నే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించింది. అయితే కొంతకాలం క్రితం మర్రి రాజశేఖర్ అనారోగ్యం పాలవడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన స్థానంలో రావి వెంకటరమణను నియమించారు.
Recommended Video
మరోవైపు...రజనీ కుమారి
ఇక ఇంత రగడకు కారణమైన మహిళా ఎన్నారై విడదల రజనీ కుమారి విషయానికొస్తే వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా నియోజకవర్గం పరిధిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈమె, చిలకలూరిపేట ప్రజలకు సుపరిచితమే. అయితే ఈమె తొలుత టిడిపి తరుపున చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అందుకోసం టిడిపి సభా వేదికల మీద తనదైన ప్రసంగాలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మంత్రి పుల్లారావుతో కలసి వెళ్లి అధినేత చంద్రబాబును కలసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత పుల్లారావుతో విభేధాలు తలెత్తిన నేపథ్యంలో ఆయన లేకుండానే పార్టీ ముఖ్యుల వద్దకు వెళ్లి తనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగారని తెలిసింది. దీంతో ఖంగుతిన్న టిడిపి అధిష్టానం అది కుదరదని తేల్చి చెప్పేశారట. దీంతో తాను ఎలాగైనా ప్రత్తిపాటిని ఓడిస్తానని శపథం చేసి వైసిపిలో చేరారని తెలిసింది.
పేట...టికెట్ ఆమెకేనని ప్రచారం
విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విడదల రజనీకుమారికి చిలకలూరిపేట టికెట్ దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీకి భారీగా ఫండ్ ఇవ్వడానికి ఆమె ముందుకు రావడం...అక్కడి వైసిపి నేత మర్రి రాజశేఖర్ ఆర్థికంగా మంత్రి పుల్లారావును ఢీకొనలేరని జగన్ భావించడంతో టికెట్ ఆమెకే ఖరారు చేయడం ఖాయమన్నట్లు ప్రజారం జోరుగా సాగుతోంది. పైగా తాను భారీగా పార్టీ ఫండ్ ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తనకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని రజనీకుమారి పూర్తి హామీ ఇచ్చారట. దీంతో వివిధ కారణాల రీత్యా మర్రి రాజశేఖర్తో పోల్చుకుంటే రజనీనే పార్టీ అభ్యర్థిగా పోటీచేయించడం ఉత్తమమని భావన వైసీపీ అధినేత జగన్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆమెను నియోజకవర్గం సింగిల్ కో ఆర్డినేటర్గా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించగా...ఊహించని ఈ పరిణామంతో మర్రి రాజశేఖర్ వర్గం షాక్కు గురైంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తమ నేతను కాదని నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారిని సమన్వయ కర్తగా నియమిస్తారా అంటూ మర్రి రాజశేఖర్ వర్గం అధిష్ఠానం తీరుపై మండిపడింది.
మర్రి రాజశేఖర్...అభిమానుల ఆందోళన
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ను పక్కనపెట్టి పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా విడదల రజనీని నియమించడంపై మర్రి రాజశేఖర్ అనుచరులు భగ్గుమంటున్నారు. మర్రి రాజశేఖర్ నివాసానికి వందలాదిగా తరలివచ్చిన...వస్తున్న నియోజకవర్గ, మండల స్థాయి నేతలు జగన్ను బహిరంగంగా విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తగా పార్టీలో చేరినవారిని నియమించారంటే జగన్ మాట తప్పుతాడు...మడమ తిప్పుతాడని అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో నియోజకవర్గం పరిధిలో సుమారు వివిధ పార్టీ పదవుల్లోని 404 మంది వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించి తామంతా మర్రి రాజశేఖర్ వెంటే మేమంతా ఉంటామని ప్రకటించారు. పార్టీ ఫండ్ ఇస్తే ఎవరికైనా పదవులు ఇస్తారా అని ప్రశ్నిస్తున్న వారు...ఇది రాజశేఖర్ ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ అన్యాయంగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
మర్రి రాజశేఖర్...టిడిపి లోకా?
జరిగిన పరిణామాలతో ఖంగుతిన్న వైసిపి నేత మర్రి రాజశేఖర్ టిడిపి లో చేరతారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయింపు విషయమై ఇంకా స్పష్టత రానందున వేచిచూద్దామని పార్టీ నేతలతో చెప్పిన ఆయన రజనీ కుమారికి పార్టీ కో ఆర్డినేటర్ పదవి కేటాయింపుతో ఇక వైసిపిని వీడాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రత్తిపాటిని గెలవనీయనంటూ రజనీ కుమారి వైసిపిలో చేరగా...తనకు కాకుండా రజనీ కుమారికి వైసిపి టికెట్ ఇస్తే ఆమెని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనిచ్చేది లేదని, అందుకు ఇండిపెండెంట్ గానైనా పోటీచేసి ఆమెని ఓడించేందుకు మర్రి రాజశేఖర్ పై ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ టిడిపిలో చేరడం ఖాయమని ప్రచారం జోరందుకుంది.