రాజకీయాల్లో మార్పు రావాలంటే గ్రామీణ విప్లవం తప్పదు.!పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో పంచాయతీ ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా కొనసాగుతోంది. బుధవారంతో మూడోదశ ఎన్నికల ప్రహసనం ముగియడంతో రాజకీయ నేతలు క్షేత్ర స్థాయిలో తమతమ బలాబలాలను విశ్లేషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినూత్నంగా స్పందిస్తున్నారు. చెట్లకు వేళ్లు ఎలాగో దేశానికి పంచాయతీలు అలాంటివని, మొదళ్లు నుంచి మందు వేస్తే తప్ప దేశ రాజకీయ వ్యవస్థ బాగుపడదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రారయపడుతున్నన్నారు.
మార్పును సూచిస్తున్న ఫలితాలు.. పంచాయతీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ స్పందన..
అంతే కాకుండా గ్రామ పంచాయతీలు అనేవి స్వతంత్ర సంస్థలు, ఎక్కడో కూర్చొని శాసించాలని చూసే ముఖ్యమంత్రులు, మంత్రుల వల్లే గ్రామాలకు నిధులున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయా యన్నారు. గ్రామాల నుంచి విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో మనకు దక్కిన ఆదరణ.. తెలుస్తున్న గణాంకాలు మార్పునకు సంకేతమన్నారు. తొలి రెండు విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచులతో బుధవారం మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన విధానం, ఈ క్రమంలో ఎదురైన ఒత్తిళ్ళ గురించి అడిగి తెలుసుకున్నారు.
రాజకీయాల్లో ఇబ్బందులు ఉంటాయని తెలుసు.. అయిప్పటికి 25 ఏళ్లు ప్రయాణం చేసానన్న గబ్బర్ సింగ్..
విజేతలకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ ప్రజలు వారిపై ఉంచిన ఆశలను, ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సదాశయంతో, సిద్ధాంత బలంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఈ క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయని తెలిసే 25 ఏళ్ల ప్రయాణం చేసానని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా కుదురుతుంది? వేల కోట్లు ఉన్న వ్యక్తుల ముందు మీరు నిలబడగలరా? అని చాలా మంది తనను సూటిగా ప్రశ్నిచారని తెలిపారు.
ఓటమితో క్రుంగిపోవద్దు.. గెలుపుతో గర్వం కూడా రాకూడదన్న జనసేనాని..
ఐతే తనలాగే ఆలోచించి, ఆశయాల కోసం బలంగా నిలబడే యువత, ఆడపడుచులు ప్రతి గ్రామంలో ఉంటారని, వారిని నడిపించే వ్యక్తి ఒకరు కావాలని, తాను నిలబడితే వాళ్లంతా తన వెంట నిలబడతారనే గాఢమైన నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేసారు గబ్బర్ సింగ్. అందుకే తన వంతు కృషి తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నానని తెలిపారు. ఎక్కడో కూర్చొని గ్రామాల సంక్షేమాన్ని గాలికొదిలేస్తే అభివృద్ది ఎలా సాద్యమవుతుందని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు గర్వాన్ని తీసుకురాకూడదని, అలాగే ఓటమితో నిరాశచెందకూడదని పవన్ పిలుపునిచ్చారు.
స్పూర్తి నింపిన యువ ఐ.ఎ.ఎస్. అధికారి వ్యాఖ్యలు.. అందుకే పంచాయతీ బరిలో పోటీకి దిగానన్న పవన్..
అంతే కాకుండా యువ ఐ.ఎ.ఎస్. అధికారి మాటలు తనను బలంగా తాకాయని పవన్ గుర్తు చేసారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరవాత కేరళ నుంచి ఒక యువ ఐ.ఎ.ఎస్. అధికారి తనను కలవడానికి వచ్చారని, 'ఫలితాలు చూసి నిరుత్సాపడకండి... పంచాయతీల మీద దృష్టిపెట్టండి మీరు కోరుకునే మార్పు కచ్చితంగా వస్తుంది. గ్రామాల్లో మీలాగా ఆలోచించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. కేరళ రాష్ట్రంలో మీ ఆలోచనలకు అనుగుణమైన పంచాయతీ పాలన వ్యవస్థ ఉంది. పంచాయతీకి నిధులు వస్తే సవ్యంగా ఖర్చు చేశారా? లేదా? దేనికి ఎంత ఖర్చు చేశారో కచ్చితంగా చెప్పి తీరాలి. అక్కడ ఏకగ్రీవాలు ఉండవు. అందుకని పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేసి మార్పుకు అక్కడనుండి శ్రీకారం చుట్టాలని ఆ యువతి సూచించిందని పవన్ గుర్తు చేసారు.