హైదరాబాద్లో రష్యా కూచిపూడి నర్తకి బ్యాగ్ మాయం
హైదరాబాద్: రష్యాకు చెందిన కూచిపూడి నర్తకి బ్యాగ్ మాయమైంది. నాలుగవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రష్యాకు చెందిన అలీఫా కుచ్తో హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి వచ్చారు. బ్యాగ్ను స్టేడియంలోని మేకప్ రూమ్లో పెట్టి నాట్యం చేసేందుకు శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు వేదికపైకి వెళ్లారు.
నాట్య ప్రదర్శన ముగించుకుని మేకప్ రూమ్కు వెళ్లిచూడగా బ్యాగ్ కనిపించలేదు. బ్యాగులో పాస్పోర్టుతో పాటు డబ్బులు, పలు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాల్గవ కూచిపూడి నాట్య సమ్మేళనానికి 22 దేశాలనుంచి 8500 మంది నృత్య కళాకారులు, నాట్యాచార్యులు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కూచిపూడి గ్రామ కులదేవతలైన బాలత్రిపుర సుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో శోభాయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత ధ్వజారోహణం, గురువందనం జరిగింది.
పసుమర్తి రామలింగశాస్ర్తీ శిష్య బృందం శశిరేఖ పరిణయం యక్షగానాన్ని ప్రదర్శించారు. యామినిరెడ్డి బృందం నృత్య ప్రదర్శన అమెరికాకు చెందిన జ్యోతి చింతలపూడి అనామషక్, ఎలినా తరపోవా (రష్యా) వాగ్గేయకారుల మనోభిరాముడు శ్రీరాముడు ప్రదర్శించారు. విశాఖకు చెందిన బాలకొండలరావు నేతృత్వంలో శిష్య బృందం ఆలోకయే శ్రీ బాలకృష్ణం అంటూ తరంగం ప్రదర్శించిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.
బెంగుళూరు కళాకారులు సరస్వతీ రజతేష్ ఆధ్వర్యంలో దశోహం, ప్రతిభా రాజ్గౌడ్ బృందం అలరులు కురియగ, వెంపటి శ్రావణి బృందం లక్ష్మీబాయి (అమెరికా) పసుమర్తి మృత్యుంజయ శర్మ కూచిపూడి బృందాలు ప్రదర్శించిన ఆయా అంశాలు అలరించాయి.