జగన్ సర్కార్కు మరక: హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉండగా.. రైతు భరోసా కేంద్రాలకు రంగులు
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో సాహసానికి పూనుకుంది. ప్రభుత్వ భవనాలు, గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రంగులను పులిమారంటూ ఆరోపణలను, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోన్న ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో మరో అడుగు ముందుకేసింది. తాను అనుకున్నదే చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలకు కొత్త రంగులను వేసింది. ఈ సారి పార్టీ జెండాలోని రంగులు కాకుండా.. ఇదివరకు విడుదల చేసిన జీవో ప్రకారం రంగులను ఎంపిక చేసింది.
APSRTC: రోడ్డెక్కిన బస్సులు.. అనేక నిబంధనలు: సిటీ బస్సులపై కీలక నిర్ణయం: సందడిగా బస్టాండ్లు
తీర్పు రిజర్వులో ఉంచిన వేళ..
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న అన్ని భరోసా కేంద్రాలకు ఆ జీవోలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా రంగులను వేస్తోంది. ప్రస్తుతం ఈ రంగుల వ్యవహారం మొత్తం హైకోర్టులో ఉంది. దీనిపై విచారణను పూర్తి చేసిన హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్లో ఉంచింది. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలంగా వస్తుందనేది తెలియని పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాలకు కొత్త రంగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతికూలంగా హైకోర్టు ఉత్తర్వులు వెలువడటమంటూ జరిగితే..మళ్లీ వాటిని తొలగించాల్సి రావడం ఖాయం.
జాతీయవాదంతో కొత్త రంగులు..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు రంగులకు వేయాల్సిన రంగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ఖరారు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల కార్యాలయాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతిబింబించేలా రంగులను వేసిన విషయంలో హైకోర్టు నుంచి చుక్కెదురైన నేపథ్యంలో.. ఈ కొత్త రంగులను వేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కిందటి నెల 23వ తేదీన జీవోను తీసుకొచ్చారు. జాతీయవాదాన్ని, గ్రామాభివృద్ధిని ప్రస్ఫూటింపజేసే థీమ్ను ఎంచుకున్నారు.
రైతు భరోసా కేంద్రాలకు అవే రంగులు..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాలకు కొత్తగా టెర్రాకోట, ఆకుపచ్చ నీలం, తెలుపు రంగులను వేయడానికి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను విడుదల చేశారు. ఒక్కో రంగునకు ఒక్కో అర్థాన్ని ఇచ్చింది ప్రభుత్వం. భూమిని, మట్టిని ప్రతిబింబించేలా టెర్రా కోట రంగును ఎంపిక చేశారు. పచ్చని పంట పొలాలకు నిదర్శనంగా, హరిత విప్లవాన్ని గుర్తుకు తీసుకొచ్చేలా ఆకుపచ్చ రంగును వేయనున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాలు, ప్రాజెక్టులను ఉద్దేశించి నీలం రంగును ఎంచుకున్నారు. పాలు, పాడి పరిశ్రమాభివృద్ధికి సూచికగా, శ్వేత విప్లవానికి సంకేతంగా తెలుపు రంగును ఎంపిక చేశారు.
కోర్టు తీర్పు ప్రతికూలంగా ఉంటే..
ఈ జీవోకు అనుగుణంగా రైతు భరోసా కేంద్రాలకు రంగులను వేశారు. నిజానికి- ఫలానా రంగులు వేయాలంటూ ఇప్పటిదాకా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదు. ఈ దిశగా ఎలాంటి సూచనలు చేయలేదు. రంగుల వ్యవహారం హైకోర్టులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ప్రభుత్వం సొంతంగా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అది మళ్లీ వివాదాస్పదంగా మారే అవకాశాలు లేకపోలేదు. రంగులపై వాదనలు, విచారణను ముగించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. అదే సమయంలో రైతు భరోసా కేంద్రాలకు కొత్త రంగులను పూయడం వివాదాస్పదమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.