తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సుప్రీం జడ్జి చలమేశ్వర్ సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటులో రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందిందా? లేదా? అనేది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న అని ఆయన అన్నారు. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయని జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యానించారు.
విశ్వంలో కలవడం, విడిపోవడం అనేది సహజమైన చర్య అని చెబుతూ అదే తెలంగాణ, ఏపీ విషయంలోనూ జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన 'విభజన కథ' పుస్తకాన్ని ఆదివారం నగరంలోని ఓ హోటల్లో జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ బిల్లు లోక్సభలో పాసవ్వలేదని అరుణ్కుమార్ తన పుస్తకంలో రాశారని ప్రస్తావిస్తూ అయితే, కొన్ని ఘటనలు చరిత్రలో అలా మిగిలిపోతాయని, చరిత్ర నుంచి మానవుడు నేర్చుకున్నది ఏమీ లేదనే వాదన ఉందని అన్నారు. ఇది చరిత్ర తప్పా? మనిషి తప్పా? అనే అంశం కూడా ప్రశ్నగానే ఉందని అన్నారు.
కొన్నేళ్లుగా రాజకీయ ప్రక్రియ చాలా రకాలుగా మార్పు చెందిందని, ఇందుకు అనుగుణంగా సమాజంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మార్పులకు అనుగుణంగా ఇప్పటికైనా మనుషులు జ్ఞానం సంపాదించుకుని, పొరపాట్లు తిరిగి చేయకుండా ఉంటే ఈ సమాజానికి మంచిదని అన్నారు.
రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలపై చాలా పుస్తకాలు వచ్చే అవకాశం ఉన్నా ఎవరూ రాయలేకపోయారని 'ఆంధ్రజ్యోతి' ఎడిటర్ కె.శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే నూతన ఏపీకి ఏం కావాలనే అంశంపై అక్కడి ప్రజల నుంచి డిమాండ్ రావాల్సిన అవసరం ఉందని ఉద్యమ సమయంలో తాను రాసిన వ్యాసాల్లో తెలిపానని గుర్తు చేశారు.
కానీ, అక్కడ అటువంటి పరిస్థితి లేదని నాయకులు తేల్చేశారని అన్నారు. విభజనతో తెలంగాణకు లాభం జరిగిందని, ఏపీకి నష్టం జరిగిందనే భావన నెలకొందని, అయితే, ఏపీకి ఏవిధంగా నష్టం జరిగిందో.. అందుకు పరిష్కార మార్గాలు ఏమిటో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు
ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి కొత్త నాయకులు రాలేదని, అక్కడి ప్రజలకు రాష్ట్ర విభజన నష్టంతోపాటు కొత్త నాయకులు రాకపోవడం ద్వారా మరో నష్టం జరిగిందని, తెలంగాణలో మాదిరిగా ప్రజల విశ్వసనీయతను పొంది, వారిని ముందుండి నడిపించే నాయకత్వం కొరవడిందని వ్యాఖ్యానించారు.