కిరణ్ రెడ్డికి రాంరాం: త్వరలో బిజెపిలోకి సబ్బం హరి?
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని సమైక్యాంధ్ర పార్టీకి మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి గుడ్బై చెప్పే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) వైపు చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పార్టీలోకి చేరి, రానున్న కార్పోరేషన్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయాలని బిజెపి నాయకత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను ఆహ్వానించాలని కూడా అనుకుంటోంది. నాలుగు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున విశాఖ నుంచి పోటీకి దిగారు. అయితే, పోలింగ్ జరగడానికి ముందు కీలక దశలో బిజెపికి మద్దతు ఇస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అప్పటి నుంచే ఆయన బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా బిజెపిలో చేరాలనే ప్రయత్నాలను ఆయన ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపి అగ్రనేతలతో ఆయన రహస్య మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో విశాఖ గ్రేటర్ ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో తన సత్తాను చాటాలనే ఉద్దేశంతో బిజెపి ఉంది. గతంలో కార్పోరేషన్ మేయర్గా పనిచేసిన సబ్బం హరికి అన్ని వార్డులకు చెందిన నేతలతో సత్సంబంధాలున్నాయి. దాంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానించి కార్పోరేషన్ ఎన్నికల్లో బలం చాటాలని బిజెపి అనుకుంటోంది.
విశాఖ పార్లమెంటు స్థానానికే కాకుండా విశాఖ ఉత్తర శాసనసభా నియోజకవర్గానికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోంది. కార్పోరేషన్పై ఈ స్థితిలో కన్నేసిన బిజెపి సబ్బం హరిని పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే సబ్బం హరి బిజెపిలో చేరవచ్చునని అంటున్నారు.