చంద్రబాబు పకడ్బందీ గేమ్ ప్లాన్: సబ్బం హరి, జగన్-పవన్లకు ప్రశ్న
అమరావతి: టీడీపీ నాడు ఎన్డీయేలో ఉండటం, ఇప్పుడు దూరం జరగడం సరైనదేనని మాజీ ఎంపీ సబ్బం హరి గురువారం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గేమ్ ప్లాన్ పకడ్బంధీగా చేశారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
మరో ఆరు నెలలు గడిస్తే మాత్రం ఎవరు గెలుస్తారో చెప్పలేమన్నారు. 2019 ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని, కానీ ఎంపీగానా, ఎమ్మెల్యేగానా తేల్చుకోలేదన్నారు. కానీ అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశ్యం ఉందన్నారు. చెప్పారు. ఒకవేళ టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నట్టయితే ఎంపీగా పోటీ చేసేవాడినేమో అన్నారు.
తాను రాజకీయ అవకాశవాదిని కాదని, అలా అయితే, టీడీపీలో చేరమని చంద్రబాబు పిలిచినప్పుడే వెళ్లేవాడినని చెప్పారు. బీజేపీ కూడా అన్ని పార్టీల్లా రాజకీయ అవసరం కోసమే పని చేస్తోందన్నారు. ఏపీకి ఎన్నో చేస్తామని బీజేపీ చెప్పిందని, ఇప్పుడు అవి ఏమయ్యాయన్నారు.
Recommended Video
ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి ఉండి ఉంటే మోడీ ధైర్యంగా చెప్పి ఒప్పించి ఉండాల్సిందన్నారు. మోడీ ఇప్పుడైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. నాడు ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సిద్ధాంతాలు, నైతిక విలువల గురించి నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.
ఏపీకి ఇచ్చేది ఏమీ లేదని కేంద్రం చెప్పినా వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తాను చంద్రబాబు కోసం మాట్లాడటం లేదని, అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నానని చెప్పారు. ఎవరు చెబుతున్నది న్యాయమో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.