విజయమ్మకు షాక్: బరి నుంచి వైదొలిగిన సబ్బం హరి
విశాఖపట్నం: విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపు పోటీ చేస్తున్న సబ్బంహరి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఎవరినైనా బాధించి ఉంటే తనను క్షమించాలని కోరారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించడంతో తాను చాలా బాధకు గురైనట్లు చెప్పారు. ఇక రాష్ట్రం సమైక్యంగా ఉండటం సాధ్యం కానందునే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
విశాఖపట్నంలోనూ, రాష్ట్రంలోనూ అరాచక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు సబ్బం చెప్పారు. అరాచక శక్తి అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచిది కాదని చెప్పారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల కూటమికే అధికారం రావాలని సబ్బం హరి అన్నారు. తెలుగు ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని తాను కోరుకుంటున్నట్లు సబ్బం హరి తెలిపారు. తన వ్యాఖ్యలతో జై సమైక్యాంధ్ర పార్టీకి సంబంధం లేదని చెప్పారు.
విభజనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుందని సబ్బం హరి తెలిపారు. కడప నుంచి కాకుండా వైయస్ విజయమ్మను విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోటీ చేయిస్తున్నారో తెలుసని సబ్బం అన్నారు. విశాఖపట్నంలో అనేక వనరులు, పరిశ్రమలు ఉన్నందునే ఇక్కడ్నుంచి ఆమెను పోటీ చేయిస్తున్నారని చెప్పారు.
లబ్ధి పొందేందుకు తాను ఎన్నికల బరిలో దిగలేదని చెప్పిన ఆయన, అరాచక శక్తులు విశాఖపట్నంలోకి రాకూడదని అన్నారు. విశాఖపట్నం రక్షణ బాధ్యత తనదేనని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదరణ గ్రాఫ్ పడిపోయిందని, ఆయన పేపర్ సర్క్యులేషన్ కూడా పడిపోయిందని అన్నారు.
అరాచక శక్తులు, దోపీడి శక్తులను తరిమేయండని విశాఖ శ్రేయస్సు కోసం తెలుగు ప్రజలను కోరుతున్నట్లు సబ్బం హరి పిలుపునిచ్చారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, సర్వేలు కూడా ఉన్నాయని సబ్బం చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని తాను భావిస్తున్నట్లు సబ్బం హరి తెలిపారు. గతంలో తనకు టిడిపి నుంచి ఆఫర్ వచ్చినా తాను నిరాకరించినట్లు సబ్బం హరి తెలిపారు. తాను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజీ పడలేదని చెప్పారు.