టిపై ఇక లాభంలేదు, విజయమ్మ వద్దనే: సబ్బం వివరణ
విశాఖపట్నం: తాను విశాఖ బరి నుండి తప్పుకొని టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థికి మద్దతివ్వడంపై సబ్బం హరి వివరణ ఇచ్చారు. అరాచక శక్తులను ఓడించేందుకే తాను బిజెపి అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఆయన బుధవారం విశాఖలో చెప్పారు. విభజన కంటే అరాచక శక్తుల వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టమని వ్యాఖ్యానించారు. విశాఖలో బిజెపి ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశముందన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. తనకు ఎలాంటి రహస్య అజెండాలు లేవన్నారు.
సబ్బం హరి జై సమైక్యాంధ్ర పార్టీ నుండి విశాఖలో నామినేషన్ దాఖలు చేసినా... ఆయన మంగళవారం బరి నుండి తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో తన నివాసంలో మాట్లాడుతూ... జై సమైక్యాంధ్ర పార్టీకి రాజీనామా చేసినట్టు, ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూ, ఆ లక్ష్యసాధనకు కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేశామన్నారు.
ఎలాగైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న భావనతో సుప్రీం కోర్టులో కేసు వేశామన్నారు. జూన్ 2న రాష్ట్ర విభజన అధికారికంగా అమల్లోకి రానున్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం సానుకూలంగా ఉంటుందని, విభజనపై స్టే వస్తుందని ఆశించామన్నారు. అయితే, అందుకు విరుద్ధంగా స్టేను నిరాకరిస్తూ, కేసును ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేయడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఇక సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయడం వృథా అని భావించి, పోటీ నుంచి విరమించుకుంటున్నానన్నారు.
తన వల్ల ఓట్లు చీలడం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపి అభ్యర్థి విజయమ్మకు లాభించడం తనకు ఇష్టం లేదన్నారు. అది కూడా పోటీ నుంచి విరమించుకోవడానికి ఓ కారణమన్నారు. తనకు తెలుగుదేశం, బిజెపిల నుంచి ఆహ్వానం అందిందన్నారు. తన నిర్ణయం ఎవరికైనా బాధ కలిగించి ఉంటే వారిని క్షమించాలని కోరారు. జగన్ అధికారంలోకి వస్తే, రాష్ట్ర విభజన కంటే అధికనష్టం జరుగుతుందని హరి చెప్పారు.
ఆయన్ను కెసిఆర్ హైదరాబాద్ రానివ్వడని తెలిసే, సీమాంధ్రలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. ఉత్తరాంధ్ర వనరుల్ని కొల్లగొట్టుకుపోవడమే జగన్ రహస్య అజెండా అని, అందుకోసమే తన తల్లి విజయమ్మను కడప, పులివెందుల నుంచి పోటీకి దించకుండా విశాఖ నుంచి పోటీకి నిలబెట్టారన్నారు. జగన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రాదన్నారు. సీమాంధ్ర శ్రేయస్సు, విశాఖ రక్షణ కోసం తాను ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. విశాఖను విజయమ్మ ఏమీ అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, విశాఖను ఇలాగే ఉంచితే చాలన్నారు. విశాఖపట్నం ఎంపీ స్థానం 80 శాతం బిజెపికే దక్కుతుందన్నారు. విశాఖ ప్రజలు కడప సంస్కృతిని, ఫ్యాక్షనిజాన్ని వద్దనుకుంటున్నారని, అందుకు అనుగుణంగానే వారు తీర్పు ఇస్తారన్నారు. వాస్తవానికి టిడిపి, బిజెపి విడివిడిగా పోటీ చేస్తే బలంగా ఉండేవి కాదని, కానీ కూటమిగా బరిలో దిగడం వల్ల విజయావకాశాలు మెరుగయ్యాయన్నారు. తనకు ఓటు వేసే వారు ఆ ఓటును టిడిపి, బిజెపిలకు వేయాలన్నారు.\